వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై గట్టి పట్టుదలతోనే ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ మూడు సాధిస్తామని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రులు ఇంకొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో అసలు పాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని తలపోస్తున్న విశాఖ ప్రజల మనోగతం ఏంటి? ఇక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. దీనిపై ఆన్లైన్ మీడియా సంస్థలు వెంటనే రంగంలోకి దిగిపోయా యి. ప్రజల నోటి ముందు మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి.
ఈ క్రమంలో విశాఖ వాసులు పాలనా రాజధానిని కోరుకుంటున్న మాట వాస్తవమేనని స్పష్టమైంది. రాజధానిని చేస్తామంటే.. మేం మాత్రం ఎందుకు వద్దంటాం అని వారు ప్రశ్నిస్తున్నారు. సో.. మొత్తానికి పాలనా రాజధానిపై వారు కూడా ఓకే అన్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు తర్జన భర్జనలు పడిన ఈ విషయంలో క్లారిటీ వచ్చేసరికి వైసీపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే..విశాఖ వాసులు ఇక్కడే మెలిక పెడుతున్నారు. ఇది విని వైసీపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఇదేంటి కథ ఇలా అడ్డం తిరుగుతోంది? అనుకుంటున్నారు.
“పాలనా రాజధాని వస్తే కాదనిఎందుకు అంటాం. మంచిదే. కానీ, రైతుల పొట్టగొట్టి ఏర్పాటు చేస్తే మాత్రం సహించేది లేదు. అయినా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జగన్ అమరావతికి మద్దతు పలికారు. 30 వేల ఎకరాలు కావాలని చెప్పారు. అప్పట్లోనే విశాఖను పాలనా రాజధాని చేస్తే బాగుంటుందని మాట మాత్రంగా కూడా ఎందుకు చెప్పలేదు? అలా చెప్పి ఉంటే అసలు అమరావతి వద్ద భూములు తీసుకునే అవకాశం లేకుండా పోయేది. రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉండేది“ అని వారు ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు విశాఖను రాజధాని చేయాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే అన్ని రూపాల్లోనూ విశాఖ డెవలప్ అయిపోయిందని ఇక్కడకు వచ్చి ఆస్తులు ఏర్పాటు చేసుకోవడం మినహా ఏమీ లేదని నిష్టూరంగా మాట్లాడుతున్నారు. ఇలా ఏవిధంగా చూసుకున్నా.. విశాఖ వాసుల్లో రాజధానిపై వ్యతిరేకత లేకపోయినా..జగన్ విశ్వసనీయతపైనే వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని ఎలా బుజ్జగించాలనే విషయం ఇప్పుడు వైసీపీ మంత్రులకు ఇబ్బందిగా మారింది.