`జై బాలయ్య` మాస్ ఆంథమ్ సాంగ్ వ‌చ్చేసింది..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

`అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట‌సింహం నందమూరి బాలకృష్ణ త‌న త‌దుప‌రి చిత్రాన్ని `క్రాక్` డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి `వీర సింహారెడ్డి` అనే టైటిల్ ను క‌న్ఫార్మ్ చేశారు.

ఇందులో బాల‌య్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విల‌న్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. మాస యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ జైబాలయ్య మాస్ ఆంథెమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

`’రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. నిన్ను తలచుకున్న వారు.. లేచి నిల్చొని మొక్కుతారు..` అంటూ మొదలైన ఈ పాట విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి రాసి ఈ పాట‌ను కరీముల్లా ఆల‌పించారు. హీరో పాత్రని ఎలివేట్ చేస్తూ సాగిన ఈ సాంగ్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో స్టైలిష్ గాగుల్స్‌ పెట్టుకుని బాల‌య్య మ‌రింత స్టైలిష్‌గా క‌నిపించారు. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ సైతం ఈ సాంగ్ లో సంద‌డి చేశారు. మొత్తానికి `జై బాలయ్య` మాస్ ఆంథమ్ సాంగ్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించ‌డం ఖాయమ‌ని అంటున్నారు.