జనసేనలోకి మాజీ మంత్రి భర్త..ఎంపీగా పోటీ?

ఏపీ రాజకీయ సమీకరణాలు ఊహించని స్థాయిలో మారుతూ ఉన్నాయి..వైసీపీకి ధీటుగా పోరాడుతున్న టీడీపీ..జనసేనతో కలిసి ముందుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని అంటున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో చంద్రబాబు-పవన్ భేటీ జరిగింది. ఆ తర్వాత మోదీతో పవన్ భేటీ, నెక్స్ట్ మోదీతో జగన్ భేటీ జరిగింది.

దీంతో రాజకీయ సమీకరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్ధం కాకుండా ఉంది. అయితే టీడీపీ-జనసేన పొత్తు దాదాపుగా ఉంటుందని, రెండు పార్టీలు భావిస్తున్నాయి. మధ్యలో బీజేపీ ఎన్ని రాజకీయాలు చేసి పవన్‌ని దూరం చేసి, ఓట్లు చీలేలా చేసి, మళ్ళీ జగన్‌కు లబ్ది చేకూరేలా ప్లాన్ చేసినా సరే ఉపయోగం ఉండదని, బాబుతో పవన్ జట్టు కట్టడం ఖాయమనే ప్రచారం ఉంది. ఇక టి‌డి‌పి-జనసేన పొత్తు ఫిక్స్ అయితే, ఆ పార్టీల్లోకి వచ్చేందుకు వైసీపీ నేతలు లైన్ లో ఉన్నారు. ఎన్నికల ముందు జంప్ అవ్వడానికి ముహూర్తం రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇదే క్రమంలో మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత సైతం వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారని, ఆమె తన భర్త కోసం జనసేనలోకి రాబోతున్నారని ప్రచారం మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక సుచరితకు హోమ్ మంత్రి పదవి వచ్చింది. పేరుకు పదవి ఉంది గాని అధికారాలు తక్కువ. తర్వాత పదవి ఊడింది. దీంతో సుచరిత కాస్త అసంతృప్తిగా ఉన్నారు. మళ్ళీ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు.

అటు ఇన్‌కంట్యాక్స్‌ కమిషనర్‌గా పనిచేసిన సుచరిత భర్త దయాసాగర్‌ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పదవీ విరమణ చేసిన దయాసాగర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో జనసేనలోకి పోటీ చేస్తారని కథనాలు వస్తున్నాయి గాని, సుచరిత మాత్రం వైసీపీని వీడటానికి సిద్ధగా లేరని, అటు దయాసాగర్ సైతం వైసీపీలో సీటు కోసం ట్రై చేస్తున్నారని మరో ప్రచారం ఉంది. మరి చివరికి సుచరిత ఫ్యామిలీ ఎటు ఉంటుందో చూడాలి.