టీడీపీ-జనసేన..బీజేపీతో వద్దు..వైసీపీ ఫార్ములా!

నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పార్టీలు కలవడం అనివార్యమైంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కలవడం, భవిష్యత్‌లో ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని చెప్పడం జరిగాయి. కానీ పొత్తు గురించి క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకపోయినా..నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఖచ్చితంగా కలుస్తాయనే చెప్పొచ్చు. సరే ఈ రెండు పార్టీలు కలుస్తాయి కదా..మరి బీజేపీ కలుస్తుందా అంటే. దానికి సమాధానం ఇంకా తేలడం లేదు.

ఎందుకంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి..ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. పేరుకే పొత్తు గాని..ఎప్పుడు పొత్తులో ఉన్నట్లు రాజకీయం చేయలేదు. అయితే పవన్, బాబుతో కలుస్తుంటే…బీజేపీ మాత్రం చంద్రబాబుతో మళ్ళీ కలిసే ప్రసక్తి లేదని అంటుంది. ఒకవేళ అలాగే బీజేపీ ముందుకెళితే..పవన్ ఖచ్చితంగా బీజేపీకి గుడ్‌బై చెప్పి..చంద్రబాబుతో కలవడం ఖాయం. లేదులే టీడీపీతో కలిస్తే నాలుగు సీట్లు వస్తాయని అనుకుంటే..బీజేపీ తప్పనిసరిగా కలుస్తుంది.

కాకపోతే ఇక్కడ మరొక ఇబ్బంది ఉంది..బీజేపీపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఊన్నారు. విభజన హామీలని నెరవేర్చలేదు..ప్రత్యేక హోదా లేదు..స్టీల్ ప్లాంట్ ఇష్యూ, రైల్వే జోన్ ఇష్యూ ఇలా చాలా ఉన్నాయి. దీంతో ప్రజలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు. ఇటు టీడీపీ శ్రేణులకు కూడా బీజేపీతో కలవడం ఇష్టం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ పరోక్షంగా వైసీపీకి సహకరిస్తూ..టీడీపీని దెబ్బకొట్టింది.

అందుకే ఇప్పుడు బీజేపీతో కలవకూడదని తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. కానీ కేంద్రం సపోర్ట్ కావాలి..అప్పుడు ఏపీలో వైసీపీని ఇంకా ధీటుగా ఎదుర్కోవచ్చు. పొత్తు పెట్టుకోకుండా పరోక్షంగా మద్ధతు తీసుకోవాలి. గత ఎన్నికల్లో వైసీపీ సైతం అలాగే చేసింది..అప్పుడు టీడీపీపై కోపంతో బీజేపీ..వైసీపీకి సహకరించింది. అప్పుడు వ్యవస్థలు అన్నీ వైసీపీకి అనుకూలంగా నడిచాయి. ఇప్పుడు టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని అదేవిధంగా ముందుకెళ్లాలి. ప్రత్యక్షంగా బీజేపీతో కలిస్తే టీడీపీ-జనసేనకు అంత కలిసి రాకపోవచ్చు. చూడాలి మరి చివరికి పొత్తు ఎలా సెట్ అవుతుందో.