కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు.. ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలిసిందే.. ఇప్పటికే ఆయన ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో కొందరు స్టార్లుగా రాణిస్తున్నారు. కృష్ణ వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే రమేష్ మాత్రం ఇప్పుడు నిర్మాతగా స్థిరపడ్డారు. మహేష్ బాబు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత ఆయన అల్లుడు సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అతను ఎవరో కాదు.. సీనియర్ నటి విజయ నిర్మల మనవడు, నటుడు నరేశ్ అల్లుడు శరణ్ కుమార్.. ‘మిస్టర్ కింగ్’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్విక, ఉర్వీ సింగ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సునీల్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది..

ఇక శరణ్ గురించి తెలియని వారు.. ఈ హీరో ఎవరా అని ఆరా తీస్తున్నారు. దీంతో మూవీ యూనిట్ శరణ్ గురించి ఓ ప్రత్యేక వీడియో రూపొందించి విడుదల చేసింది. ఆ వీడియోలో కృష్ణ, నరేశ్, సుధీర్ బాబు తమ ఫ్యామిలీ నుంచి రాబోతున్న శరణ్ కుమార్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఏడుగురు నటులు వచ్చారు. ఎనిమిదో యాక్టర్ గా శరణ్ కుమార్ వస్తున్నారు.. త్వరలోనే శరణ్ నటించిన ‘మిస్టర్ కింగ్’ విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరి శరణ్ ఇండస్ట్రీలో ఎంత వరకు నిలదొక్కుకుంటారో చూడాలి..