తెలుగు డైరెక్టర్లకు మెగాస్టార్ చిరంజీవి సూచనలు… వీరినుద్దేశించే మాట్లాడారా?

తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరో తెలియని వారు వుండరు. ఇక చిరంజీవిగారి పెద్దమనసు గురించి అందరికీ తెలిసిందే. తాజాగా చిరు ఓ చిన్న సినిమాకు తన వంతు సాయం అందించారు. అవును.. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వెళ్లి సదరు చిత్ర యూనిట్ ని ఆశీర్వదించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ అనుబంధ సంస్థ అయిన శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. నూతన హీరో హీరోయిన్లతో వంశీధర్‌ గౌడ్‌, లక్ష్మీనారాయణ సంయుక్తంగా తెరకెక్కించారు.

కాగా ఈ సినిమా రేపు అంటే, సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి జాతి రత్నాలు మూవీ డైరెక్టర్ అయినటువంటి అనుదీప్ KV కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… తాను ఈ వేడుకకు రావటానికి ప్రధాన కారణం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. ఆయన ఇక్కడే ఉండి, మనందరికీ ఆశీస్సులు అందిస్తుంటారని ప్రగాఢంగా నమ్ముతూ ఆయనకు నమస్కరిస్తున్నానని తెలిపారు. ఆయనతో సినిమాయేతర అనుబంధం ఉందన్నారు. వారి కుటుంబంలో తాను కూడా ఓ సభ్యుడిగా ఉండేవాడినని చెప్పారు మెగాస్టార్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… థియేటర్లకు జనాలు రారనేది పూర్తిగా అవాస్తవం. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు తప్పకుండా వస్తారన్నారు. అయితే డైరెక్టర్లు బాగా కథలపై వర్క్ చేయాలి. పెద్ద స్టార్లు, హిట్ కాంబినేషన్లు, కాల్షీట్లు దొరికాయని హడావుడిగా సినిమాలు తీసి పడేయద్దు. సరియైన కంటెంట్ ఉంటే మాత్రం మన తెలుగు ప్రేక్షకులు తప్పకుండా సినిమా థియేటర్లకు వస్తారు… అని అన్నారు. ఇక ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆచార్య మూవీ ప్లాప్ కావడంతో సదరు దర్శకుడికి తగిలేటట్టు ఈ మాటలు అన్నారా? అని ఓ వర్గం వారు అనిమానిస్తున్నారు.