ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోకవర్గం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువేనని అంటున్నారు టీడీపీ నాయకులు. ఇక్కడ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం తీవ్రమైన వెలితిగా మారింది. పైగా.. ఇక్కడ నేతల మధ్య ఐక్యత లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వంగలపూడి అనిత మళ్లీ ఇక్కడ కార్యక్రమాలకు హాజరు కాలేదు. మాజీ మంత్రి కెఎస్ జవహర్ గతంలో ఇక్కడ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే.
కానీ స్థానికంగా కొందరు నేతలతో ఆయకు విబేధాలు ఉండడంతో గత ఎన్నికల్లో ఆయన ఇక్కడ పోటీ చేయలేకపోయారు. మళ్లీ ఈసారి ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎవరనేది తేల్చలేదు. కానీ పార్టీనేతలు కంఠమని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరితో ద్విసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీనే అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తుంటారు.
కానీ. నియోజకవర్గ ఇన్చార్జి లేకపోవడం, మండలకమిటీలు పూర్తి స్థాయిలో నియమించకపోవడం ఇక్కడ ఇబ్బందికరంగానే ఉంది. మరోవైపు రాజమండ్రి పార్లమెంటరీ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి జవహర్.. వచ్చే ఎన్నికల్లో తనకు ఈ టికెట్ ఇవ్వమని కోరుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం దీనిపై తాత్సారం చేస్తున్నారు. ఫలితంగా.. పార్టీని నడిపించేవారు.. లేకపోవడంతో తమ్ముళ్లు ఏం చేయాలో తెలియక.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలావుంటే.. ప్రస్తుతం అధికార పార్టీ పరిస్తితి దారుణంగా ఉంది. వైసీపీ నాయకురాలు.. మంత్రి తానేటి వనిత కు ఎదురు గాలి వీస్తోంది. ఇటీవల జరిగిన బ్యాంకు ఎన్నికల్లో టీడీపీ గుండుగుత్తుగా విజయం దక్కించుకుంది. అయితే.. ఈ విజయం ఎవరి ఖాతాలో వేసుకున్నా బాగానే ఉండేది కానీ.. ఎవరికి వారు.. తమ తమ ఖాతాల్లోవేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా.. చూస్తే.. బలమైన నియోజకవర్గంలో నాయకుడిని ముందుగానే ప్రకటించేస్తే.. ఏ గొడవా లేకుండా.. పార్టీ సాఫీగా ముందుకు సాగుతుందని పరిశీలకులు చెబుతున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.