రిజర్వ్ స్థానాల్లో సైకిల్ రివర్స్!

మొదట నుంచి రిజర్వడ్ స్థానాల్లో టీడీపీకి అంత కలిసిరాదనే చెప్పాలి…ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదట నుంచి కాంగ్రెస్..ఆ తర్వాత వైసీపీ హవా కొనసాగుతూ వస్తుంది. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉన్న 29 ఎస్సీ స్థానాలు, 7 ఎస్టీ స్థానాల్లో వైసీపీ హవా కొనసాగింది. కేవలం టీడీపీ ఒకటి, జనసేన ఒక ఎస్సీ స్థానాన్ని మాత్రం గెలుచుకున్నాయి. మిగిలిన సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు నిదానంగా మారుతున్నాయి. ఇప్పుడుప్పుడే టీడీపీ పుంజుకుంటుంది. అదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

అయితే రాజకీయం ఎలా మారినా సరే…రిజర్వ్ స్థానాల్లో వైసీపీ హవానే కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెజారిటీ స్థానాలని మళ్ళీ వైసీపీ కైవసం చేసుకునేలా ఉంది. టీడీపీ-జనసేన గాని పొత్తు ఉంటే కొన్ని స్థానాల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. రాజాం, పాయకరావుపేట, పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, గోపాలాపురం, కొవ్వూరు, ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు, సంతనూతలపాడు లాంటి స్థానాల్లో టీడీపీ-జనసేన పొత్తు ప్లస్ అవుతుంది. వీటిల్లో మెజారిటీ స్థానాల్లో టీడీపీకి ఎడ్జ్ ఉంది…టీడీపీకి గాని జనసేన కలిస్తే.. ఈ స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

పొత్తు ఉన్నా సరే మెజారిటీ రిజర్వ్ స్థానాలు వైసీపీకే దక్కేలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని రిజర్వ్ స్థానాలని వైసీపీ వన్ సైడ్ గా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.  ఇటు ఎస్టీ స్థానాలని సైతం వైసీపీ కైవసం చేసుకునేలా ఉంది. అరకు, పాడేరు, కురుపాం, సాలూరు, రంపచోడవరం, పోలవరం, పాలకొండ స్థానాల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. గట్టిగా కష్టపడితే వీటిల్లో ఒక స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవచ్చు…అంతే తప్ప ఈ స్థానాల్లో వైసీపీ విజయం ఆపడం కష్టమే. మొత్తానికి చూసుకుంటే రిజర్వ్ స్థానాల్లో సైకిల్ రివర్స్ లో వెళుతుందని చెప్పొచ్చు.