తెలుగు దర్శకులపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు!

బాహుబలి ఏ ముహూర్తాన వచ్చిందో గాని ఇక అప్పటినుండి తెలుగు సినిమాల స్థాయి మారిపోయిందని చెప్పుకోవాలి. అవును… గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా చప్పుడు యావత్ ఇండియా మొత్తం వినబడుతోంది. దీనికి ఉదాహరణే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు. బి టౌన్ సూపర్ స్టార్లంతా సౌత్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమాకు సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసినదే. అలాగే తమిళ దర్శకుడు శంకర్ త్వరలోనే హిందీలో అపరిచితుడును చేయబోతున్న విషయం తెల్సిందే.

అలాగే హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ వేదా రీమేక్ కూడా మన సౌత్ దర్శకులు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కిచిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ అనే సినిమాని హిందీలో చేస్తున్నాడు. ఇందులో రణబీర్ కపూర్ హీరో. వీరు మాత్రమే కాకుండా మరి కొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఒకప్పుడు సౌత్ దర్శకులు అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు టైమ్ కల్పించుకుని మరీ సౌత్ దర్శకులతో వర్క్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

అలాగే బాలీవుడ్ లో ఓ ఇద్దరు ముగ్గురు హీరోలు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. త్వరలోనే ఒక హిందీ సినిమా ను పూరి జగన్నాథ్ మొదలు పెట్టే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇంకా కొందరు బాలీవుడ్ స్టార్ హీరోలు మరియు నటీ నటులు కూడా సౌత్ దర్శకుల దర్శకత్వంలో సౌత్ సినిమాల్లో కూడా నటించేందుకు ఓకే చెబుతున్నారు. బాహుబలి, RRR, KGF, పుష్ప, కార్తికేయ 2 వంటి సినిమాల వల్ల మన సౌత్ దర్శకుల క్రేజ్ బాగా పెరిగిపోయింది.