అదిగో పులి.. అంటే.. ఇదిగో తోక! అనే పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏది తప్పో.. ఏది ఒప్పో.. నిర్ధారించుకునే టైము.. సోషల్ మీడియా జనాలకు లేకుండా పోతోంది. దీంతో కొన్నికొన్ని వార్తలు నిజమో.. కాదో.. అనేంతగా వైరల్ అయిపోతున్నాయి. ఇలాంటి వార్తే.. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. వైసీపీ అధినేత.. ఓ ఐదుగురు కీలక నాయకులను ఓడించాలని కంకణం కట్టుకున్నారంటూ.. ఓ వార్త హల్చల్ చేస్తోంది. వీరిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. సరే.. వీరు పార్టీల అధినేతలు.. వారిని ఓడించడం ద్వారా.. తను మైలేజీ పొందేందుకు అవసరం ఉంటుంది కాబట్టి.. జగన్ ఇలా చేస్తుండొచ్చు.
కానీ, ఈ లెక్కలో చేరిన మరోనాయకుడు.. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అసలు ఈయనను జగన్ ఓడించాలని ఎందుకు అనుకుంటున్నారో.. రీజన్లేదు. ఎందుకంటే.. ఈయన ఫైర్ బ్రాండ్ ఏమీ కాదు. ఇప్పటి వరకు ఈ మూడేళ్లలో వైసీపీని పన్నెత్తి ఒక్క పరుష పదజాలంతో ఒక్కమాట అన్న పాపాన పోలేదు. పోనీ.. దూకుడు నాయకుడిగా ఏమైనా పేరుందా.. జగన్ను కాదు.. వైసీపీలో ఇతర నాయకులను కానీ, ఆయన ఎప్పుడైనా తిట్టిపోసి.. పత్రికల్లో ఫస్ట్ పేజీకి ఎక్కారా? అంటే.. అది కూడా లేదు.
కానీ, ఆయనను ఓడించేందుకు జగన్ కంకణం కట్టేసుకున్నారనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త. టీడీపీలోని ఇతర నాయకుల మాదిరిగానే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే. వైసీపీ శత్రువు అయితే కాదు. పైగా.. ఆయన సౌమ్యుడనే కితాబు ఉండనే ఉంది. గతంలో ఎంపీగా అ, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆచి తూచి మాట్లాడతారు. పదవులు వస్తాయని.. పదవులు పోతాయని ఆశించే జాబితాలో ఉన్న నాయకుడు అంతకంటే కూడా కాదు. ఇక, నియోజకవర్గంలో వైసీపీ నేతలకు కంటగింపుగా మారారా? అంటే అలా కూడా ఏమీ ఆనవాలు కనిపించడం లేదు.
మరి ఏం చూసి.. జగన్ ఆయనను ఓడించాలి. సహజంగానే రాజకీయంగా ఉండే ప్రత్యర్థిగా ఆయనపైనా ప్రత్యర్థిత్వం అనే ముద్ర సహజంగానే ఉంటుంది. అది కాదనలేం. కానీ, ప్రత్యేకంగా.. జగన్ ఓ ఐదుగురిని ఓడించాలని కంకణం కట్టుకున్నారని.. వారిలో ఈయన కూడా ఉన్నారని చేస్తున్న ప్రచారమే రాజకీయ విశ్లేషకులకు మింగుడు పడడం లేదు. సర్వత్రా నెగ్గి.. 175 స్థానాల్లో విజయం దక్కించుకునే కసి ఉంటే.. ఉండొచ్చు.. దానిలో విజయవాడ తూర్పు కూడా ఒక నియోజకవర్గం అయితే.. అవ్వొచ్చు. అంతకు మించి.. గద్దెను పనిగట్టుకుని ఓడించాల్సి న అవసరం, అయితే.. వైసీపీకి లేదని అంటున్నారు పరిశీలకులు.