జగన్ క్లాస్: ఆ ఎమ్మెల్యేలకు సీటు డౌటే?

సీఎంగా తాను చేయాల్సిన పనులు చేస్తున్నానని, ఇంకా చేస్తూనే ఉన్నానని, కానీ ఎమ్మెల్యేలుగా మీరు చేయాల్సిన పని చేస్తేనే…విజయం సాధ్యమవుతుందని, తాను కష్టపడుతున్నానని, తనకు వంద సమస్యలున్నాయని, అయితే ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలని, తనతోపాటు ఎమ్మెల్యేలూ శ్రమిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి సీఎం జగన్…తాజాగా ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న జగన్…సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు.

CM YS Jagan In Gadapa Gadapaki Mana Prabhutvam Workshop - Sakshi

తాను సమయానికి బటన్ నొక్కి ప్రజలకు పథకాలు అందిస్తున్నానని, అయితే ఎమ్మెల్యేలు చేయాల్సింది..గడప గడపకు వెళ్ళి చేస్తున్న మంచి పనులని ప్రజలకు వివరించి, వారి మద్ధతు పెంచుకోవాలని జగన్…ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. ఇలా చేస్తే 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమో చెప్పాలని అంటున్నారు. మొత్తానికైతే ఎమ్మెల్యేలని గడప గడపకు వెళ్లాలని జగన్ చెబుతున్నారు. అలాగే ఆరు నెలల్లోపు మెరుగైన ఫలితాలు కనబడకపోతే మొహమాటం లేకుండా ఎమ్మెల్యే సీటు ఇవ్వనని జగన్ చెప్పేస్తున్నారు. తర్వాత తన మీద అలిగిన ప్రయోజనం ఉండదని అంటున్నారు…మరో 20 నెలల్లో ఎన్నికలని, ఆరు నెలల్లోనే ఎన్నికల వాతావరణం మొదలైపోతుందని, కాబట్టి ఏం చేసిన ఈ ఆరు నెలల్లోనే చేయాలని జగన్ చెబుతున్నారు.

అయితే జగన్ ఇంత చెబుతున్నా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్ళి ప్రజలని కలవడంలో విఫలమవుతున్నారు. తాజాగా పీకే టీం ఇచ్చిన నివేదికలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి…అసలు గడప గడపకు వెళ్లలేదని తేలింది. అసలు టోటల్ గా 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పూర్తి స్థాయిలో వెళుతున్నారని, ఓ 50 మంది ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమంలో పెద్దగా పాల్గొవడం లేదని చెప్పారు. మరి ఈ ఆరు నెలల్లో అందరూ ప్రజల దగ్గరకు వెళ్తారో లేక…మొక్కుబడిగా కార్యక్రమంలో పాల్గొంటారో చూడాలి. మరి అలాంటి వారిని జగన్ నెక్స్ట్ ఎన్నికల్లో పక్కన పెట్టేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.