సేమ్ టు సేమ్.. డైలాగులు మాత్రమే మారాయి. విషయం మాత్రం అదే! అదే.. పవన్ ప్రసంగం. ఆయన తాజాగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. జనవాణి కార్యక్రమం నిర్వహించారు. అయితే.. ఈ సంద ర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ప్రసంగాలను పరిశీలిస్తే.. ఎక్కడో ఎవరో రాసిన డైలాగులు.. చేసిన వ్యాఖ్యలే గుర్తుకు వచ్చేలా ఉండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు అధికారం ఇవ్వాలని.. పవన్ కొన్నాళ్లుగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అదేసమయంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్యాలెస్, వైసీపీ ముఠా, పులివెందుల పం చాయతీ, రాజారెడ్డి రాజ్యాంగం, ఇసుక దోపిడీ, అధికారంలోకి వచ్చాక నిలదీస్తాం.. ఇలా.. ఆయన పలు పదాలను ప్రయోగిస్తూ.. ప్రసంగాలను దంచేస్తున్నారు. అయితే.. ఈ ప్రసంగాలను వింటున్న వారు… సేమ్ టు సేమ్ అనే కామెంట్లను జత చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం.. ఆయా డైలాగులను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు తరచుగా ప్రస్తావిస్తున్నవే కావడం.
దీంతో పవన్ సొంతగా వైసీపీపై ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయడం లేదని.. కేవలం టీడీపీ ఆఫీసు నుంచి వచ్చే స్క్రిప్టునే చదువుతున్నారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పవన్ ప్రయత్నా లు.. ఒకింత దారి తప్పుతున్నాయనే భావన వ్యక్తమవుతోంది. పోనీ.. ఎలానూ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన రెడీగానే ఉందనే వాదన ఉన్న నేపథ్యంలో.. ఇదే విషయాన్ని చెప్పేస్తే.. ఎక్కడికక్కడ నాయకులు ప్రజలతో మమేకం అవుతారు కదా! అనేది ప్రధాన చర్చ.
కానీ, ఈ విషయంపై ఇటు టీడీపీ కానీ, అటు జనసేన కానీ.. ఎక్కడా బయట పెట్టడం లేదు. పోనీ.. ఎవరికి వారు విడివిడిగా అయినా.. రాజకీయం చేస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. దీంతో పవన్ చేసే డైలాగులు.. టీడీపీ నుంచి వస్తున్నవనే వాదనకు మరింత బలం చేకూరుతోంది. ఇది ఇప్పటికి బాగున్నా.. ప్రజల్లో చర్చ సాగేందుకు.. ప్రత్యేకంగా మార్పు వచ్చేందుకు పెద్దగా అవకాశం ఉండే ఛాన్స్ లేదని అంటున్నారు పరిశీలకులు. మార్పు కావాలంటే..దానికి తగిన విధంగా మారాల్సిందేనని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.