ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నారు.. ఇది వైసీపీకి ఆనందకర పరిణామం. ఎందుకంటే.. ఆయన నోటి నుంచి ఇక్కడి ప్రభుత్వాన్ని పొగిడించుకునేందుకు ఇప్పటికే ఢిల్లీస్థాయిలో వైసీపీ నాయకులు చక్రం తిప్పారని తెలుస్తోంది. అయితే.. అదేసమయంలో బీజేపీ.. వైసీపీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ టీడీపీకి చేరువ అవుతోంది. ఇది భారీ ఎత్తున వైసీపీని కలవరపెడుతున్న అంశం. ఎందుకంటే.. ఏది జరగకూడదని.. వైసీపీ భావించిందో అదే జరుగుతోందికాబట్టి!!
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా గెలవాలంటే.. 2019 ఎన్నికల్లో జరిగినట్టుగా.. అన్ని పార్టీలూ విడివిడిగా పోటీ చేయాలనేది… వైసీపీ అధినేతగా జగన్ వ్యూహం. అందుకే.. ఆయన అన్ని పార్టీలనూ రెచ్చగొట్టేలా తన అనుంగునేతలతో కామెంట్లు చేయిస్తున్నారు. దమ్ముంటే.. పవన్ ఒంటరిగా పోటీచేయాలని.. చంద్రబాబు ఒంటరిగా గెలిచే సత్తా లేదని.. పొత్తులేకుండా.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన హిస్టరీ కూడా లేదని.. మంత్రులు.. వైసీపీసీనియర్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.
కానీ, జనసేన అధినేత పవన్ మాత్రం.. వైసీపీ వ్యతిరేక ఓటుబ్యాంకును చీలిపోకుండా చూస్తానని ప్రకటించారు.ఇతర పార్టీలను కూడా కలిపే బాధ్యతను భుజాన వేసుకుంటానని చెప్పారు. అంతేకాదు.. బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. అయితే.. తర్వాత.. తర్వాత.. దీనిపై పెద్దగా ఆయన పట్టించుకన్నట్టు కనిపించలేదు. కానీ, ఇప్పుడు అననూహ్యంగా మారిన రాజకీయ పరిణామాలను గమనిస్తే.. తెరవెనుక పవన్ భారీగానే చక్రం తిప్పినట్టు తెలుస్తోంది.
బీజేపీ పెద్దలకు ఆయన ఏపీ రాజకీయ వ్యూహాలను నూరిపోసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. బీజేపీ ఇప్పుడు చంద్రబాబు వైపు చూస్తోంది. ఏకంగా బీజేపీలో కీలక నాయకుడు.. ప్రధాన మంత్రి మోడీ పాల్గొనే కార్యక్రమానికి ఇప్పటి వరకు లేని ఆహ్వానాన్ని పలికింది. ఏకంగా..చంద్రబాబు రావాలంటూ.. ఫోన్లు చేయడం, లేఖలు రాయడం వంటివి వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏది జరగకూడదని అనుకున్నారో.. అదే జరిగిందని వైసీపీలో తర్జన భర్జన ప్రారంభమైంది. మరి ఈపరిణామాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.