ఔను.. ఇదే విషయం ఆసక్తిగా మారింది. వైసీపీలో గుసగుస పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి.. మరోసారి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయనున్నారని.. పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. దీనికి కారణం.. ఏంటి? ఇది నిజమేనా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు. ప్రస్తుతం వైసీపీ నాయకుడు.. ఎంపీ.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఇటీవల మీడియా ముం దుకు వచ్చారు.
తనకు జగన్కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. తన కుటుంబం వైఎస్ కుటుంబానికి ఎంతో ఆత్మీయం గా ఉందని.. వివరణ ఇచ్చుకున్నారు. తమపై లేనిపోని ప్రచారం చేస్తున్నారంటూ.. ఆయన మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కానీ, వాస్తవానికి ఆయన.. టీడీపీ ననేతలతో టచ్లో ఉన్నారనేది వాస్తవం. నిప్పులేకుండా పొగ రాదుకదా.. కానీ.. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. పైగా.. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు.
ఈ నేపథ్యంలోనే.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అవకాశం లేదని.. వైసీపీ నాయకులు బాహాటంగానే చెబు తున్నారు. మరోవైపు.. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదనే ఆవేదన వైవీ సుబ్బారెడ్డిలోనూ కనిపిస్తోంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు.. అంతో ఇంతో ఇక్కడ పార్టీ డెవలప్ అయిందనే వాదన ఉంది. కానీ, ఇప్పుడు.. అలాంటి పరిస్థితి లేదు. నాయకుల మధ్య రగులుతున్న వివాదాలకు పరిష్కారం ఎవరూ చూపించలేక పోతున్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి.. వైవీకి ఇక్కడ అవకాశం ఇవ్వడం ద్వారా..పార్టీ పుంజుకునేందుకు ఛాన్స్ ఇవ్వడంతోపాటు.. టీడీపీతో టచ్లో ఉన్న మాగుంటను వదిలించుకునేందుకు.. పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోందని చెబుతున్నారు. ఒకవేళ మాగుంట పార్టీలోనే ఉన్నా… ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని.. చర్చ నడుస్తోంది. కేవలం.. వైవీకి మాత్రమే ఒంగోలు ఎంపీ టికెట్ను రిజర్వ్ చేశారని అంటున్నారు. మరి ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.