మళ్ళీ ఆ జిల్లాల్లో ‘సైకిల్’కు షాక్?

ఏదో బలం పెరిగిపోయిందని గాల్లో లెక్కలు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి..తమకు ప్రజల మద్ధతు పెరిగిందని మాటలు చెబితే సరిపోదు…చేతల్లో అది కనిపించాలి. అప్పుడే బలం పెరిగిందని తెలుస్తోంది. కానీ చేతల్లో చూపించే విషయంలో ప్రతిపక్ష టీడీపీ ఫెయిల్ అవుతున్నట్లే కనిపిస్తోంది. అసలు జగన్ పై ప్రజలకు విరక్తి పెరిగిపోయిందని, ఇంకా ప్రజలు తమనే ఆదరిస్తారనే భ్రమల్లో టీడీపీ నేతలు ఉంటున్నారు.

ఎందుకంటే బలం పెరిగిందనేది పూర్తి నిజం కాదనే చెప్పొచ్చు…రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ వీక్ గానే కనిపిస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో టీడీపీ బలం పెద్దగా పెరగలేదు. గత ఎన్నికల్లో కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ జిల్లాల్లో ఒక్క సీటు కూడా టీడీపీ గెలుచుకోలేదు.

అయితే ఇప్పుడు ఆ జిల్లాల్లో ఏమన్నా సీన్ మారిందా? వైసీపీపై వ్యతిరేకత పెరిగి…టీడీపీకి అనుకూలంగా రాజకీయం ఉందా? అంటే పెద్దగా లేదనే చెప్పాలి. కాకపోతే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ జిల్లాల్లో వైసీపీ బలం కాస్త తగ్గిన మాట వాస్తవమే. ఎందుకంటే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం వల్ల ఈ పరిస్తితి వచ్చింది. అలా అని ఆ జిల్లాల్లో టీడీపీ బలం బాగా పెరిగిపోయిందని అనుకోవడానికి లేదు.

ఇంకా ఈ జిల్లాల్లో టీడీపీ బలం పెరగలేదు. ఏదో పావు వంతు నేతలు కాస్త పుంజుకున్నారు గాని…మిగిలిన వారి పరిస్తితి ఘోరంగానే ఉంది. కర్నూలులో రెండు, మూడు సీట్లలో తప్ప టీడీపీ పెద్దగా పుంజుకోలేదు. కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా అదే పరిస్తితి ఉంది. ఇక విజయనగరంలో కాస్త మెరుగ్గా ఉంది గాని…వైసీపీని దాటే బలం టీడీపీకి కనిపించడం లేదు. మొత్తానికైతే ఈ నాలుగు జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి షాక్ తగిలేలా ఉంది.