కర్నూలు: టీజీకి బాబు హ్యాండ్?

కర్నూలు జిల్లా రాజకీయాల్లో టీజీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు…ఎన్నో ఏళ్ల నుండి టీజీ వెంకటేష్ కర్నూలు జిల్లాలో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు…మొదట్లో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ లో పనిచేసిన టీజీ…రాష్ట్ర విభజనతో టీడీపీలోకి వచ్చేశారు. ఇదే క్రమంలో 2014లో కర్నూలు సిటీలో పోటీ చేసి ఓడిపోయారు….ఇక ఆ తర్వాత చంద్రబాబు…టీజీని రాజ్యసభకు పంపించారు. అలాగే 2019 ఎన్నికల్లో టీజీ తనయుడు టీజీ భరత్ కు కర్నూలు సిటీ సీటు ఇచ్చారు.

అయితే భరత్ గెలుపు దగ్గర వరకు వచ్చి బోల్తా కొట్టారు…తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఎన్నికల తర్వాత టీజీ వెంకటేష్..టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. కానీ భరత్ టీడీపీలోనే ఉన్నారు…కానీ కర్నూలు సిటీలో దూకుడుగా రాజకీయం చేయడం లేదు..అలాగే ఆ మధ్య ఇంచార్జ్ పదవి నుంచి సైతం తప్పుకునే పరిస్తితి వచ్చింది…తనకు ఇంకాస్త సమయం ఇవ్వాలని, అప్పుడు కూడా సరిగ్గా లేకపోతే తీసేయోచ్చని భరత్ చెప్పుకొచ్చారు.

కానీ కర్నూలు సిటీలో అనుకున్న మేర పనిచేయడంలో భరత్ సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు. వైసీపీకి కంచుకోటగా ఉన్న సిటీలో టీడీపీని బలోపేతం చేయలేకపోతున్నారు. పైగా తన తండ్రి ఏమో బీజేపీలో ఉండటం పెద్ద మైనస్ అయింది. సొంత కేడర్ భరత్ ని నమ్మే పరిస్తితిలో లేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు…ఈ సారి భరత్ ని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

కర్నూలు సిటీలో ముస్లిం ఓటర్ల బలం ఎక్కువ…పైగా వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్…అదే వర్గం. దీంతో టీడీపీ నుంచి ముస్లిం అభ్యర్ధినే బరిలో దించితే బెటర్ అని బాబు ఆలోచిస్తున్నారట. డీసీసీ మాజీ అధ్యక్షుడు అహమ్మద్‌ అలీఖాన్‌ను కర్నూలు బరిలో నిలిపేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చారని తెలిసింది. మొన్నటివరకు కాంగ్రెస్ లో పనిచేసిన అలీఖాన్…కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సపోర్ట్ తో టీడీపీలోకి రావడానికి ఫిక్స్ అయ్యారని సమాచారం. అలాగే సిటీ సీటు కూడా దక్కించుకోవాలని చూస్తున్నారు. బాబు కూడా భరత్ ని తప్పించి అలీఖాన్ వైపే మొగ్గు చూపేలా ఉన్నారు.