ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్‌.. కేక పుట్టించే ప్లాన్ వేసిన డైరెక్టర్!

బాహుబలితో వరల్డ్ వైడ్ ఫేమ్ దక్కించుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుసగా పాన్ ఇండియా సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. ఆ సినిమాల్లో ఒకటైన ఆది పురుష్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ హైబడ్జెట్ మూవీని రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తున్నాడు. ఈ పౌరాణిక సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా అలరించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా… ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ 2023 జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.

అయితే తాజాగా ఆది పురుష్‌ మూవీ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్‌ వచ్చింది. డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఆది పురుష్ మూవీని త్రీడీ వెర్ష‌న్‌, ఐమాక్స్ ఫార్మాట్‌లో థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించాడు. ఆదిపురుష్‌ని థియేటర్లలో చూసే వారికి సాధ్యమైనంత ఉత్తమమైన అనుభూతిని అందించడానికి ఓం రౌత్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ మేరకు సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ లాస్ ఏంజెల్స్‌లో పూర్తి చేస్తున్నట్లు ఒక ట్వీట్ ద్వారా తెలిపాడు. అలానే ప్రేక్షకుల ముందుకు తన మూవీని తీసుకొచ్చేందుకు తాను ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఐమ్యాక్స్ కెమెరాతో దిగిన ఒక ఫొటోను కూడా షేర్ చేశాడు.

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా ఆదిపురుష్ ప్రేక్షకుల మనసులను దోచేయనుంది. నవంబర్ 10, 2021న సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. కాగా ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడిగా, సైఫ్ ఆలీఖాన్ రావ‌ణాసురుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా నాగే హనుమంతుడిగా, కృతి స‌న‌న్ జాన‌కి దేవిగా మెరవనున్నారు. ఈ మూవీ కోసం భారతీయ సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు వాడని ఒక కొత్త మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీని యూజ్ చేస్తున్నట్లు ఇప్ప‌టికే మూవీ యూనిట్ వెల్లడించింది. ఆది పురుష్‌తో ప్ర‌భాస్ బాహుబలిని మించిన విజయాన్ని అందుకుంటారా లేదా అనేది చూడాలి.