రాజకీయంగా.. తాము పొత్తులో ఉన్నామని చెబుతారు. కానీ, ఎక్కడా ఒకే వేదికను పంచుకున్న దాఖలా కనిపించదు. ఇదో చిత్రమైన వ్యవహారం. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా.. తాము కలిసే పోటీ చేస్తామని కూడా చెబుతున్నారు. అయితే.. ఆ తరహా వ్యూహాలు ఎవరికీ.. ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అసలు ఈ పొత్తు ఏ తీరాలకు? అనే ప్రశ్నలు రాజకీయ తెరమీదకి వస్తున్నాయి. ఆ రెండు పార్టీలే.. బీజేపీ-జనసేన. చేతులు కలిసినా.. మనసులు కలవని పొత్తుతో ముందుకు సాగుతున్నారు.
రాజకీయాల్లో సహజంగా.. ఒక పార్టీ మరొక పార్టీకి పొత్తుగా ఉంటే.. ఇవతల పార్టీకి అంతో ఇంతో ప్రయోజనం ఉండాలి. అదేసమయంలో పొత్తు కూడా ఇరు పక్షాల మధ్య సఖ్యతకు దారితీయాలి. కానీ, చిత్రం ఏంటో.. జనసేన-బీజేపీ పొత్తులో ఇలాంటి అంశాలు మనకు ఎక్కడా కనిపించడం లేదు. బీజేపీతో 2019 ఎన్నికలు ముగియగానే పొత్తుకు వెళ్లిన జనసేన.. ఎందుకు చేతులు కలిపింది? అని ప్రశ్నిస్తే.. ఆ పార్టీ నాయకులు నీళ్లు నములుతారు. ప్రస్తుతమే కాదు.. గత ఎన్నికల సమయంలోనూ.. జనసేనకు ఉన్న ఓట్లు బీజేపీకి లేవు.
కానీ, జనసేన తగుదునమ్మా.. అంటూ.. పొత్తు పెట్టుకుంది. ఇక, బీజేపీ నేతలను పొత్తు ఎందుకు పెట్టుకు న్నారని అంటే.. పవన్ ఇమేజ్ను తాము అంతో ఇంతో.. మూటగట్టుకుని.. గట్టెక్కాలనే ఉద్దేశం ఉందని చెబుతున్నారు. కానీ, జనసేన మాత్రం ఎలాంటి వాదన వినిపించదు. పైగా ఇప్పటి వరకు వచ్చిన ఉప ఎన్నికల్లో.. బీజేపీదే పైచేయిగా ఉంది. అంటే.. పొత్తులో ఉన్న జనసేనను ఏమాత్రం ఖాతరు చేయడం లేదని.. బీజేపీపై విమర్శలు ఉన్నాయి. ఇదిలావుంటే.. పోనీ.. కీలక విషయాల్లో అయినా.. వేదికలు పంచుకుంటున్నారా? అంటే అది కూడా లేదు.
ఎవరికి వారుగానే రాజకీయాలు చేసుకుంటున్నారు. పవన్ వచ్చే సభలకు.. బీజేపీకి, కమల నాథులు నిర్వహించే సభలకు జనసేనానులకు ఆహ్వానాలు ఉండవు. ఒకరి మొహం ఒకరు చూసుకోవడం కూడా లేదు., కానీ, ఎవరైనా.. ఈ పొత్తు ఎందుకు అంటే మాత్రం బీజేపీ నుంచి వెంటనే రియాక్షన్ వస్తుంది. పొత్తు మాయిష్టం.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసే పోటీకి దిగుతాం.. అని అంటారు. మరిఇంతగా ఆశలు పెట్టుకున్నప్పుడు.. కలిసి మెలిసి ఉండాలి కదా? అంటే.. ఆ ఒక్కటి అడగొద్దని అంటారు. దీంతో ఇది వచ్చే ఎన్నికల వరకు సాగుతుందా? మధ్యలోనే తెగుతుందా? అనేది ఆసక్తిగా మారింది.