వైసీపీ అధినేత జగన్ సూచనలు.. సలహాలు.. ఆదేశాల మేరకు పార్టీ నాయకులు.. మంత్రులు.. ఎమ్మెల్యే లు… అందరూ ప్రజాబాట పట్టారు. గడపగడపకు ప్రభుత్వం పేరుతో పర్యటనలు చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి సమస్యలపై అనేక ప్రశ్నలు, నిలదీతలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు.. తమకు అందడం లేదని.. మహిళలు కూడా నిలదీస్తున్నారు. దీంతో మంత్రులు ఎమ్మెల్యేల్లో అసహనం వ్యక్తమవుతోంది.
ఇది ఒక భాగమైతే.. మరోవైపు.. జగన్ ఉద్దేశాన్ని నాయకులు సరిగా అర్ధం చేసుకున్నట్టు కనిపించడం లేద ని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. జగన్ ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. వారి సమస్యలు ఓపికగా వినాలని కూడా చెప్పారు. అదే సమయంలో మళ్లీ మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని.. ఇప్పుడు లబ్ధిపొందని వారికి .. ఖచ్చితంగా వచ్చే సారి ఇస్తామని.. హామీ ఇవ్వాలని కూడా జగన్ సూచించారు. అయితే.. వైసీపీ నాయకులు మాత్రం మనసు పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి లేదని అంటున్నారు. ఓవరాల్గా జగన్ ప్లాన్ అనుకుందొకటి అవుతోంది ఒకటిగా ఉంటోంది.
కేవలం వెళ్లాలి కాబట్టి వెళ్తున్నారని.. విమర్శలు వస్తున్నాయి. కేవలం ఎంచుకున్న పది ఇళ్లకు వెళ్లి.. అంతా బాగుందనే విధంగా ప్రచారం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. ముందుగానే.. వలంటీర్లతో ఇళ్లను ఎంపిక చేసుకుంటున్నారు. అదే సమయంలో అంతా బాగుందని.. సీఎం జగన్ గ్రేట్ అని ప్రజలకు ముందుగానే స్క్రిప్టు రెడీ చేసి ఇస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాయ లసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి తెలుస్తోంది. అదే సమయంలో దీనిని ఒక యాత్ర మాదిరిగా చేస్తున్నారు.
కానీ, జగన్ ఆలోచనలు, ఉద్దేశాలు వేరు. ప్రజల నుంచి వారి అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకుని.. వాటిని సరిచేసుకునే విధంగా ముందుకు సాగాలనేది జగన్ భావన. దీంతో వచ్చే ఎన్నికల నాటికి 50 శాతమైనా.. ప్రజల నుంచి వ్యతిరేకతను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ, ఈ మౌలిక సూత్రాన్ని నాయకులు విస్మరిస్తున్నారు. ఫలితంగా.. అనుకున్న విధంగా ఈ కార్యక్రమానికి మైలేజీ లభించడం లేదని అంటున్నారు పరిశీలకులు.