ఔను! ప్రదాన ప్రతిపక్షం టీడీపీలో ఒక కీలకమైన ఇబ్బంది కర పరిణామం.. కలవరపెడుతోంది. పార్టీలో గతంలో ఉన్న విధంగా ప్రస్తుతం మహిళా నేతలు లేకుండా పోయారు. అన్నగారి హయాంలోనూ.. తర్వాత కూడా.. కొన్నాళ్ల వరకు మహిళలు భారీ సంఖ్యలోనే ఉన్నారు. వారి కోసమే. అన్నగారు ఎన్టీఆర్.. తెలుగు మహిళ.. అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి.. వారిని ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ ఉన్నప్ప టికీ.. ఆశించిన సంఖ్యా బలం లేకపోవడం గమనార్హం. ఎక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా.. కొందరికి మాత్రమే పరిమితం అవుతోంది.
వాస్తవానికి తెలుగు దేశం పార్టీలో తెలుగు మహిళ వ్యవస్థను ఆదర్శంగా తీసుకుని.. ఇతర పార్టీల్లోనూ.. మహిళా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆదిలో అద్భుతంగా పనిచేసిన.. ఈ వ్యవస్థ.. రానురాను మాత్రం ఇబ్బందులు పడుతోంది. గతంలో నన్నపనేని రాజకుమారి..సుదీర్ఘకాలంపాటు.. మహిళ అధ్యక్షురాలిగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత.. ఏడాదికిందట.. తెలుగు మహిళ అధ్యక్ష పదవిని.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అప్పగించారు.
తద్వారా.. ఎస్సీ, ఎస్టీ మహిళాలోకాన్ని.. పార్టీలో బలోపేతం చేయాలనేది చంద్రబాబు వ్యూహం. ఇది బాగా నే ఉన్నప్పటికీ.. ఈ ఏడాది కాలంలో తెలుగు మహిళ బలోపేతం కాలేదన్నది సీనియర్ నేతల మాట. ప్ర స్తుతం వైసీపీలోని మహిళా విభాగాన్ని చూస్తే.. బలోపేతంగా ఉంది. సీఎం జగన్ కార్యక్రమాలకు మహి ళలను భారీ సంఖ్యలో ఈ విభాగమే తీసుకువస్తోంది. ఈ దిశగా చూసుకుంటే.. తెలుగు మహిళ కొంత వెనుకబడినట్టుగా కనిపిస్తోంది. పార్టీలో బాహాటంగానే వినిపిస్తున్న వ్యాఖ్యలను తెలుసుకుంటే.. కొంత ఆవేదన కలుగుతుంది కూడా.
గతంలో నన్నపనేని రాజకుమారి.. ఉన్నప్పుడు.. తను ఎలివేట్ కావడం కన్నా.. సమస్యలను ఎలివేట్ చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారనే పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో మహిళల ప్రాతినిధ్యానన్ని పెంచేందుకు ఎక్కువగా పప్రయత్నించారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు.. తర్వాత కూడా.. మహిళలకు భాగస్వామ్యం ఉండేలా.. అధిష్టానం దగ్గర కూర్చుని.. పట్టుబట్టి సాధించిన విషయాలు అనేకం ఉన్నాయి. జిల్లా పార్టీల్లోనూ.. మహిళలకు ప్రాతినిధ్యం పెంచారు. పురుషుల సభ్యత్వాలతో పాటు.. మహిళల సభ్యత్వాలు పెంచడంలో.. నన్నపనేని పోటీ పడేవారు.
ఈ తరహాలో ఇప్పుడు ఉన్న నాయకత్వం కూడా కృషి చేయాలని అంటున్నారు సీనియర్లు. వచ్చే మహానాడు నాటికి.. తెలుగు మహిళలను మరింత బలపరిచేలా.. సభ్యత్వం పెంచేలా.. వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని కూడా చెబుతున్నారు.