ఐదుగురు అక్కా చెల్లెళ్లతో జోడీ కట్టిన ఏకైక హీరో మెగాస్టార్

తెలుగు రాష్ట్రాల్లో నేటికీ మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుంటాయి. స్వశక్తితో సినీ పరిశ్రమలో చిరంజీవి ఎదిగారు. ఇక చిరు తన సినీ కెరీర్‌లో ఐదుగురు అక్కాచెల్లెళ్లతో నటించిన హీరోగా నిలిచారు. అవన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. చిరుతో నటించిన ఆ ఐదుగురు అక్కా చెల్లెళ్లు గురించి తెలుసుకుందాం.

తొలినాళ్లలో చిరంజీవి-రాధిక జోడీ అంటే ప్రేక్షకుల్లో చాలా అంచనాలుండేవి. 1978లో ‘న్యాయం కావాలి’ సినిమా ద్వారా తొలిసారి చిరంజీవి-రాధిక జోడీ కట్టారు. ఆ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో చిరు-రాధిక కాంబినేషన్‌లో పలు సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. 1990 వరకు వీరి జోడీ కొనసాగింది. అభిలాష, గూఢాచారి నం.1, యమకింకరుడు, రాజా విక్రమార్క ఇలా ఎన్నో హిట్ చిత్రాలలో వీరు నటించారు.

ఇక రాధిక చెల్లెలు నిరోష కూడా చిరుతో హీరోయిన్‌గా నటించింది. 1991లో ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ‘స్టువర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమాలో చిరు సరసన నిరోష నటించింది. ఆ సినిమాలో ఇంకో హీరోయిన్‌గా విజయశాంతి కూడా ఉంది.

చిరంజీవి-నగ్మా కలిసి ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు వంటి సినిమాల్లో నటించారు. నగ్మా, రోషిణి, జ్యోతిక అక్కాచెల్లెళ్లు. నగ్మాతో పాటు రోషిణి, జ్యోతిక కూడా చిరు సరసన నటించారు. మాస్టర్ సినిమాలో రోషిణి చిరుకు జోడీగా జత కట్టింది. ఇక ఠాగూర్ సినిమాలో చిరుతో జ్యోతిక నటించింది. ఇలా ఐదుగురు అక్కాచెల్లెళ్లతో చిరు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.