యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తున్న షో `ఎవరు మీలో కోటీశ్వరులు`. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ఐదో సీజన్ ప్రారంభం కాగా..ఇప్పటివరకు ఎంతో మంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేశారు. అప్పుడప్పుడూ సినీ సెలబ్రెటీలు సైతం విచ్చేసి బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అయితే ఆదివారం ఎపిసోడ్తో ఈ సీజన్ పూర్తి అయింది.
లాస్ట్ ఎపిసోడ్కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్లో ఎన్టీఆర్-మహేష్ల మధ్య వచ్చిన డిస్కషన్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఒకరిపై ఒకరు పంచ్లు, జోకులు వేసుకుంటూ చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ గురించి ప్రశ్న రాగా.. తనకు క్రికెట్ అంటే ఇష్టమన్నారు మహేష్. చిన్నప్పుడు బాగా ఆడేవాడినని.. ఆ తర్వాత మానేశానని, ఇప్పుడు ఆడటం కుదరడం లేదని చెప్పుకొచ్చాడు.
దాంతో ఎన్టీఆర్ వెంటనే.. `రాజమౌళితో త్వరలోనే సినిమా చేస్తున్నారుగా ఇక అన్ని ఆటలు ఆయనే ఆడిపిస్తారు. అన్ని ఆటలు సెట్లో చూపిస్తారు, జక్కన్న మామూలోడు కాదు` అంటూ స్వీట్గా వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ చెప్పిన దానికి తనదైన స్టయిల్లో స్మైల్తో కవర్ చేశారు మహేష్. అయితే ఈ సంభాషణ చివరిగా జక్కన్నతో పని చేయడం అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ అన్నారు తారక్.
కాగా, ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న మహేష్ బాబు.. త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ తయారు చేసి పనిలో నిమఘ్నమై ఉన్నారు.