ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని.. ఇతర భాషల్లో రీమేక్ చేయడం ఇటీవల రోజుల్లో బాగా కామన్ అయిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలను చేసేందుకు తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కానీ, కొందరు హీరోలు మాత్రం రీమేక్ చిత్రాల వైపు కూడా చూడరు. ఈ లిస్ట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. నరసింహుడు మినహా ఆయన తన సినీ కెరీర్లో రీమేక్ చిత్రాల చేసేందుకు ఒప్పుకోలేదు.
అయితే న్యాచురల్ స్టార్ నాని కూడా ఈయన బాటలోనే నడవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు నటించారు.
నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నాని ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ ఆయనకు `మీరెందుకు రీమేక్ సినిమాల వైపు చూడటం లేదు` అనే ప్రశ్న ఎదురైంది.
అందుకు నాని సమాధానం ఇస్తూ..గతంలో తను చేసిన రెండు రీమేకులు తనకి పాఠం నేర్పడం వల్ల ఆ వైపు వెళ్లదలచుకోలేదని చెప్పాడు. అలాగే రీమేకులు తనకి అంతగా సెట్ కావని తెలిపిన నాని.. తాను రీమేకులలో చేయడం కంటే, తన సినిమాలు రీమేక్ అవుతుండటం తనకి ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, ఇకపై కూడా రీమేకులు చేసే ఆలోచన లేదని తేల్చేశారు.