సర్కారు ఉద్యోగుల సమ్మె బాట

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సమస్య తీవ్రమైంది. నిధుల కోసం రాష్ట్రం అన్ని దారులనూ వెతుకుతోంది. ఎక్కడ అవకాశముంటే అక్కడ తీసుకుంటోంది. ఆర్థిక మంత్రి బుగ్గన ప్రతినెలా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు వచ్చినా అంతా సంక్షేమ పథకాలకే సరిపోతోంది.. నవరత్నాల్లో భాగంగా ప్రారంభించిన పలు పథకాలకు నిధులు సమకూర్చలేక ఆర్థికశాఖ అవస్థలు పడుతోంది. ఈ ప్రభావం మొత్తం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై పడింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు పీఆర్సీ మాటే ఎత్తడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పే రివిజన్ కమిషన్ నివేదిక ఇచ్చి మూడేళ్లు దాటింది. దానిని అమలు చేయాలని కోరితే అదిగో.. ఇదిగో అని చెబుతున్నారు కానీ ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘల నాయకులు సీఎస్ తో నిరసన వ్యక్తం చేశారు. ఇలా అయితే కాదు.. మేం సమ్మె చేస్తాం.. మీ ఇష్టం అంటూ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసులు అందజేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఇంతకుమించి మేమేం చేయలేమని నాయకులు పేర్కొన్నారు.

ప్రభుత్వం అసలు పట్టించకోకపోవడంపై ఉద్యోగులు సీఎస్ తో అసహనం వ్యక్తం చేశారు. మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా సార్? అని ప్రశ్నించారు. వారికి సమాధానం చెప్పలేక సీఎల్ నీళ్లు నమిలినట్లు తెలిసింది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూ అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీలను అలాగే గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె రెండో దశకు చేరకముందే డిమాండ్లను తీర్చాలని.. లేకపోతే తీవ్రస్థాయిలో నిరసన సెగ సర్కారుకు తాకేలా చేస్తామని ఓ రకంగా హెచ్చరించినంత పనిచేశారని తెలిసింది. ఏపీజేఏసీ నాయకులు సీఎస్ కు 5 పేజీల లేఖను ఇచ్చారు. ఈనెల 7లోపు వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని మీడియాకు నాయకులు తెలిపారు. పీఎఫ్, బీమా సౌకర్యం తదితరాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.1600 కోట్లు బకాయిలు ఇవ్వాలని తెలిపారు. ఇక పెండింగ్ డీఏ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సీపీఎస్, ఉద్యోగులహెల్త్ కార్డులు, జీతాల పెంపు, ముఖ్యంగా పీఆర్సీ ఇవ్వడం తదితర సమస్యలను సీఎస్ ద్రుష్టికి తెచ్చారు.అసలు ఆర్థిక మంత్రి పీఆర్సీ గురించి ఒక్కసారి కూడా చర్చించలేదని నిరసన వ్యక్తం చేశారు. ఈనెల 7 నుంచి దశలవారిగా పోరాటం చేస్తామని తెలిపారు. మరి ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందా, లేదా అనేది సీఎస్ నుంచి ఎటువంటి హామీ వారికి లభించలేదు.