ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతున్న మ్యూజిక్ సెన్సేషన్ థమన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే తనదైన మ్యూజిక్తో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా బ్లాక్బస్టర్ కావడంలో తనవంతు పాత్రను కూడా పోషిస్తున్నాడు. ఇక ఈమధ్య కాలంలో థమన్ చేయని సినిమా లేదంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. ఈ క్రమంలో థమన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనను చాలా బాధపెట్టిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇంతకీ థమన్ను అంతగా బాధపెట్టిన ఆ విషయం ఏమిటో మనం తెలుసుకుందామా.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి ఆదరణను అందించారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అడీషనల్ బలంగా మారింది. అయితే థమన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ‘‘ఏడపోయినాడో…’’ అనే పాటకు తను ప్రాణం పెట్టి పనిచేసినా, అది ఆడియెన్స్కు ఎందుకో ఎక్కలేదని, దాని ప్లేస్లో ‘పెనివిటి’ పాట వారికి బాగా నచ్చిందని థమన్ అన్నాడు.
ఇలా తాను అనుకున్న పాట కాకుండా అదే సినిమాలో వేరొక పాట ప్రేక్షకాదరణ పొందడం తనను కొంతమేర బాధపెట్టిందని ఆయన చెప్పారు. ఇక ఈ సందర్భంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంగీతం అందించేందుకు థమన్ పెద్దగా కష్టపడలేదని, లిరిక్స్ బాగుండటంతో తనకు నచ్చిన విధంగా మ్యూజిక్ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా పాటలకు తాను ఊహించని రెస్పాన్స్ రావడం తనకు షాకిచ్చిందని చెప్పాడు. ఏదేమైనా తారక్ సినిమాకు రావాల్సిన రెస్పాన్స్, బన్నీ సినిమాకు వచ్చిందని థమన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు థమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.