ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్(72) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా విషమించడంతో.. ఆదివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న శివశంకర్ మాస్టర్.. భారత చలనచిత్ర పరిశ్రమలో 10 భాషల్లో పనిచేశారు. 800 పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన ఆయన.. పలు సినిమాల్లో నటించారు కూడా. మరోవైపు పలు టీవీ షోలకు జడ్జ్గానూ వ్యవహరించారు.
అలాంటి మాస్టర్ తన చివరి శ్వాస వరకు పని చేయాలనే ఆకాంక్షించారు. అంతే కాదు, మరణం కూడా తనకు షూటింగ్లోనే రావాలని, సినిమా సెట్లోనే తను కన్నుమూయాలనేది మాస్టర్ కోరకట. ఈ విషయాన్ని తరచూ ఆయన తన సన్నిహితులతోనే కాకుండా పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఆ విషయాన్నే గుర్తు చేసుకుని ఆయన సన్నిహితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కాగా, శివశంకర్ భౌతిక కాయానికి ఈ రోజు మధ్యాహ్నాం 2 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.