నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ హీరోగా నవరసాలను అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వించిన రాజేంద్ర ప్రసాద్.. పలు సినిమాలకు దర్శకుడిగానూ, నిర్మాతగానూ వ్యవహరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకుపోతున్న ఈయన.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నారట.
అందుకు కారణం ఏంటీ..? అసలు చనిపోవాలనిపించే కష్టం ఆయనకు ఏం వచ్చింది..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1956 జులై 19న రాజేంద్ర ప్రసాద్ పుట్టాడు. నిమ్మకూరు సీనియర్ ఎన్టీఆర్ గారి స్వస్థలం కావడంతో, ఆయన నటనా ప్రభావం రాజేంద్రప్రసాద్ మీద పడింది.
అయితే రాజేంద్ర ప్రసాద్కి సినిమాలపై ఉన్న ఆసక్తి తెలుసుకున్న ఎన్టీఆర్.. అతనిని చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు అందులో రాజేంద్రప్రసాద్ గోల్డ్ మెడల్ సంపాదించి అవకాశాల కోసం వేట స్టార్ట్ చేశాడు. కానీ, ఒక్కటంటే ఒక్క అవకాశామూ ఆయన తలపు తట్టలేదు. సంపాదన లేక తల్లిదండ్రులకు బారం కాలేక.. ఎన్నో రోజులు పస్తులతో పడుకున్నాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగినా అవకాశాలు రాకపోవడంతో.. ఓపిన నశించి సూపైడ్ చేసుకోవాలనుకున్నారట. అలాంటి సమయంలో ఒక్క అవకాశం రాజేంద్ర ప్రసాద్ జీవితాన్ని మలుపు తిప్పింది. సినీ నిర్మాత, నటుడు, రచయిత అట్లూరి పుండరీకాక్షయ్య ఎన్టీఆర్తో ‘మేలుకొలుపు’ సినిమా తీస్తున్నాడు. అయితే ఆ చిత్రంలో ఒక తమిళ నటుడు పాత్రకు రాజేంద్ర ప్రసాద్ చేత డబ్బింగ్ చెప్పించారు. ఇక అప్పటి నుంచీ డబ్బింగ్ చెబుతూ.. మెల్ల మెల్లగా నటనా అవకాశాలను దక్కించుకుని నట కిరీటిగా ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.