కైకాల ఆరోగ్యం విషమం : క్లారిటీ ఇచ్చిన కుమార్తె..!

టాలీవుడ్ సీనియర్ నటుడు, ఎన్టీఆర్, ఏఎన్నార్ సమకాలికుడైన కైకాల సత్యనారాయణ కొద్ది రోజులుగా అనారోగ్యంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించింది అంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఇవాళ ఉదయం కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషయమై అపోలో ఆసుపత్రి విడుదల చేసింది.

‘ కైకాల సత్యనారాయణ ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. రక్త పోటు తగ్గింది. కిడ్నీల పనితీరు చాలా మెరుగు పడింది. త్వరలోనే ఆయన కోలుకుంటారు’ అని అపోలో ఆస్పత్రి వైద్యులు బులెటిన్లో పేర్కొన్నారు. కాగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఆయన కూతురు రమాదేవి కూడా స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక ఆడియో వాయిస్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

‘ నా తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగుంది. అందరితో మాట్లాడుతున్నారు. ఎవరూ ఆందోళన చెందక్కరలేదు. ఆయన స్పృహలోనే ఉన్నారు. బీపి కంట్రోల్ అయింది. రెండు కిడ్నీలు సాధారణంగా పని చేస్తున్నాయి. ప్రస్తుతం ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు.ఆయన ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు, వార్తలు వస్తున్నాయి.. ఎవరూ నమ్మవద్దు.’ అని ఆ వాయిస్ మెసేజ్ లో రమాదేవి పేర్కొన్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న అందరి నటుల్లో ఎంతో సీనియర్ అయిన కైకాల సత్యనారాయణ ఆరు దశాబ్దాలకు పైగా తన సినీ జీవితంలో సుమారు 700కు పైగా సినిమాల్లో నటించారు.