మంచు మోహన్ బాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకు ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో కష్టాలు పడి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన మోహన్ బాబు.. రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి టాలీవుడ్ కలెక్షన్ కింగ్గా గుర్తింపు పొందారు. ఇక హీరోగా కాకుండా నిర్మాతగానూ బోలెడన్ని సినిమాలను నిర్మించారు.
మరోవైపు రాజకీయాల్లోనూ అడుగు పెట్టిన మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు. ఆ తర్వాత పాలిటిక్స్ నుంచి సైడ్ అయిన మోహన్బాబు.. ప్రస్తుతం వైసీపీలో చేరారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మోహన్ బాబు.. ఈ పొలిటికల్ రీఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్ధేశం లేదని, రానని కుండబద్దలు కొట్టేశారు. 99 శాతం రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనని ఆయన అన్నారు. ఇక ఆ ఒక్క శాతం ఎందుకని ఆర్కే ప్రశ్నించగా.. గతంలో ప్రధాని మోదీ తన కుటుంబాన్ని ఢిల్లీ ఆహ్వానించిన విషయాన్ని మోహన్ బాబు గుర్తు చేశారు. మోదీ ఎంతో ఆప్యాయంగా తన కుటుంబాన్ని పిలిచి ఇది నీ ఇల్లే అనుకో, ఎప్పుడైనా రావొచ్చు అని చెప్పారని వివరించారు. అందువల్లనే ఆ ఒక్క శాతం మాత్రం అవకాశం ఉందని మోహన్ బాబు తెలిపారు.