దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల తనయుడు, నటుడు వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలనటుడిగా 1972లో `పండంటి కాపురం` చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన నరేష్.. ఇప్పటి వరకు 200 సినిమాల్లో నటించారు. హీరోగానూ పలు సినిమాలు చేశారు. అయితే హీరోగా కంటే సహాయక పాత్రల ద్వారా నరేష్ కు మంచి గుర్తింపు దక్కింది.
ఇక ఈయన నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. సుధీర్ బాబు, ఆనంద జంటగా నటించిన ఈ చిత్రానికి `పలాస 1978` ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించిన నరేష్.. విలక్షణమైన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. కూతురు కంటే కులమే ఎక్కువనుకునే పాత్రలో జీవించేశాడు.
అయితే ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్..`శ్రీదేవి సోడా సెంటర్` లోని పాత్ర నా గత చిత్రాలను మించిపోయింది. విలన్ పాత్రలకు కూడా నరేశ్ని తీసుకోవచ్చనే ఆలోచన ఇండస్ట్రీ వర్గాల్లో రేకెత్తించింది. సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ గారు.. ‘నువ్వు, సుధీర్ ఈ సినిమాకు ప్రాణం పోశారు.. నీ పాత్ర నాకు కన్నీరు తెప్పించింది’ అనడంతో నాకు ఏడుపు వచ్చేసింది.అలాగే నేను గొప్ప నటుడు కావాలనేది మా అమ్మ కోరిక. అయితే ఈ సినిమా తర్వాత మా అమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుందనుకుంటున్నాను.` అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో నరేష్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.