స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిధి.. హీరో ఎవరంటే..!

అందం ఉండి అభినయం ఉండి ఇప్పటివరకు సరైన సక్సెస్ సాధించని హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నిధి అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయమై మూడేళ్లు దాటినా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ఆమె కెరీర్లో ఇప్పటి దాకా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక్కటే విజయం అందుకుంది. 2018 లో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమా ద్వారా నిధి అగర్వాల్ టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. తన తొలి సినిమాతోనే పరాజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత ఆమె అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 2019 లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా నిధి అగర్వాల్ కు తొలి విజయాన్ని అందించింది. ఆ సినిమా తర్వాత నిధి అగర్వాల్ వరుసబెట్టి ఛాన్సులు వస్తాయని అంతా భావించినప్పటికీ ఆమె కెరీర్ ఆశించినంత వేగం అందుకోవడం లేదు.ప్రస్తుతం ఆమె క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ భామ తెలుగులో మరో స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మాస్ట్రో సినిమా తర్వాత ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఎంపికైంది. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించనుంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలతో పాటు గల్లా అశోక్ అరంగేట్రం మూవీ హీరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా అయినా తనకు స్టార్డం తెచ్చిపెడుతుందేమోనని నిధి అగర్వాల్ ఆశలు పెట్టుకుంది.