టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆదివారం సాయంత్రం సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, మూడు షోలకే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీ కావడం లాంటి కారణాలతో ఏపీలో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు.
ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖులు జగన్ను కలిసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు జగన్ నుంచి ఆహ్వానం అందింది. సినీపెద్దలతో కలిసి వచ్చి సమస్యలను వివరిచాలని జగన్ తరఫున రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చిరంజీవిని తెలిపారు. ఈ క్రమంలోనే చిరంజీవి నివాసంలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశం జరిగింది.
నాగార్జున, దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, సి.కల్యాణ్, వీవీ వినాయక్, కొరటాల శివ, మైత్రి మూవీస్ రవి ప్రసాద్, సుప్రియ, ఆర్.నారాయణమూర్తి, ఎన్వీ ప్రసాద్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. సినీ కార్మికులు, థియేటర్ కార్మికుల సమస్యలు, బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు, ఇతర సమస్యలపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.