‘ఒక ఊరిలో’ సినిమాతో తన సినీ కెరీర్ను ప్రారంభించిన డైరెక్టర్ రమేశ్ వర్మ పెన్మత్స.. రైడ్, అబ్బాయితో అమ్మాయి, వీర, రాక్షసుడు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన రవితేజ హీరోగా ‘ఖిలాడి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఖిలాడి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మూవీ టాకీ పార్ట్కు సంబంధించిన షూటింగ్ను ఇప్పటికే ఫినిష్ చేశామని ఆయనన్నారు.
డబ్బు, భావోద్వేగాల ప్రాధాన్యతల మధ్య ఏది ముఖ్యమో ఆలోచింపజేసేలా ఖిలాడి సినిమా ఉంటుందన్నారు. రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నారా? అని అడిగిన ప్రశ్నను ఆయన దాటవేశారు. కానీ ఈ సినిమాలో చూడబోయే రవితేజ పాత్ర ఇంతకు ముందు చూసిన అన్ని పాత్రల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఖిలాడి’ రవితేజ కెరీర్లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ అని అన్నారు. చిత్ర నిర్మాణానికి రూ.65 కోట్లు ఖర్చు పెట్టామని.. టెక్నికల్ పరంగా కూడా చిత్రం అద్భుతంగా ఉంటుందని తెలిపారు.