తారక్‌కు రాఖీలు కట్టిన బుల్లి చెల్లెళ్లు.. ఫోటోలు వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ తన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాడు. ఇప్పటికే తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. తాజాగా తారక్ తనలోని యాంకర్‌ను మరోసారి మనకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ద్వారా పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ గేమ్ షోను హోస్ట్ చేస్తున్న తారక్, కర్టెన్ రైజర్ షోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి స్టార్ట్ చేశాడు.

ఆగస్టు 22న ఈ గేమ్ షో కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ జెమిని టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ అయ్యింది. అయితే అదే రోజున రాఖీ పండుగ కావడంతో చాలా మంది ప్రేక్షకులు ఈ గేమ్ షోను ఇళ్లల్లో కూర్చుని చూశారు. ఇక కొందరు అయితే తమ అన్నయ్య వచ్చాడంటూ సంతోషంతో టీవీలకు అతుక్కుపోయారు. కాగా తారక్‌ను అన్నలా భావించే కొందరు చెల్లెమ్మలు ఆయనకు రాఖీలు కడుతూ, హారతిలిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అభిమానులు, ఆడపడుచులు తనపట్ల చూపించిన ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని తారక్ పలు సందర్భాల్లో తెలిపిన సంగతి తెలిసిందే. ఏదేమైనా రాఖీ పండుగ లాంటి పర్వదినాన తమ అభిమాన హీరో బుల్లితెరపై కనిపించడంతో నందమూరి అభిమానులు పండుగను రెండింతలుగా చేసుకున్నారు. ఇక తారక్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.