సినీ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు.. ఏ విషయంలో అయినా ముక్కు సూటిగా వ్యవహరిస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఇక సినిమాల్లో కంటే టీవీ షోస్ లోనే ఎక్కువగా కనిపించే నాగబాబు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు.
తన పర్సనల్, ఫ్యామిలీ విషయాలతోపాటు.. సామాజిక అంశాలపై కూడా పోస్టులు పెడుతుంటారీయన. ఇక తాజాగా థర్డ్ వేవ్ కరోనాపై నాగబాబు ఆసక్తికర పోస్ట్ పెట్టారు. `ఇండియా ఇంతకు ముందు అయితే కరోనా మూడో వేవ్ ని అడ్డుకోగలదని నమ్మకం ఉండేది. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే ఉత్తరాఖండ్ లో జరగబోతున్న కన్వర్ యాత్రకి అనుమతి ఇచ్చిందో.. అప్పటి నుంచిక థర్డ్ వేవ్ వల్ల ప్రమాదం తప్పేలా లేదని అర్థం అయింది.
ప్రస్తుతం భారత్ ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి ఈ యాత్రని ఆపి తీరాలి. లేదా కరోనా మూడో వేవ్ ని ఆహ్వానించాలి.` అంటూ ట్వీట్ చేశారు నాగబాబు. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలు సమంజసంగానే ఉండడంతో.. పలువురు నెటిజన్లు నాగబాబుకు మద్ధతు ఇస్తున్నారు.