ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులపై కొనసాగుతున్న రగడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై అమరావతి రైతులు ఇప్పటికీ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే జగన్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూడు రాజధానుల గొడవ మళ్లీ రాజుకుంది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై మాట్లాడారు.
ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని ఆయన వెల్లడించారు. ఈ ఏడాదని ప్రత్యేకంగా చెప్పలేము కానీ ఏ క్షణమైనా ఈ రాజధానులు ఏర్పాటు అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు వీటికి సంబంధించిన పనులు ఇప్పటికే వేగంగా నడుస్తున్నాయన్నారు. కొన్ని దుష్టశక్తులు ఈ ప్రక్రియను ఆపేందుకు చూస్తున్నాయని, అయినా అవేవీ కుదరవని వెల్లడించారు. మూడు రాజధానుల ఏర్పాటు తర్వాత సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేస్తారని ప్రకటించారు. టీడీపీ నేతలపై బొత్స తీవ్రంగా విమర్శలు చేశారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.