దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటికి కనిపించని కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు.
దీంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు తమిళ సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య కూడా భారీగా విరాళం అందించారు.
తాజాగా సౌందర్య సీఎం స్టాలిన్ను కలిసి తన భర్త విశాగన్ తరఫున రూ. కోటి విరాళంగా ఇచ్చారు. కాగా, ఇప్పటికే సూర్య ఫ్యామిలీ రూ. కోటి, దర్శకుడు మురుగదాస్ రూ.25 లక్షలు, అజిత్ రూ. 25 లక్షలు ముఖ్యమంత్రికి అందించిన సంగతి తెలిసిందే.