జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి..ఏమిటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మే 20న తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన అభిమానులు సెలెబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆయన ఇంటికి వెళ్లి విషెస్ చెబుతారు. కానీ ఈసారి లాక్ డౌన్ ఉండటం, కరోనా విజృంభిస్తుండటం, ఎన్టీఆర్ కరోనా బారిన పడటంతో అభిమానులకు ఎన్టీఆర్ తన జన్మదినానికి ఒక రోజు ముందే మెసేజ్ పెట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.

“అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీ మెసేజ్ లు చదువుతున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను. ప్రస్తుతం నేను బాగున్నాను. కోవిడ్ ను జయిస్తాను అని, త్వరలో కోలుకుంటానని ఆశిస్తున్నాను. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. కర్ఫ్యూ, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంటివద్దనే జాగ్రత్తగా ఉండండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద కానుక. దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. ఒకరికొకరు సాయం చేసుకోండి. త్వరలోనే మనదేశం కరోనాను జయిస్తుందని నమ్ముతున్నా. అప్పుడు వేడుకలు చేసుకుందాం. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి” అంటూ ఎన్టీఆర్ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.