దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా పేరే వినిపిస్తోంది. సెకెండ్ వేవ్లో కరోనా ఊహించని రీతిలో విజృంభిస్తూ ప్రజలను ముప్పతిప్పులు పెడుతోంది. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటు నుంచి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఒక సిగరెట్ కారణంగా 18 మంది కరోనా బారిన పడ్డారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీనగర్ కాలనీలో నివాసముండే ఓ మార్కెటింగ్ మేనేజర్ ఇటీవల బయటకు వెళ్లాడు. మార్గం మధ్యలో ఆగినప్పుడు అక్కడ సమీపంలో ఒకరు సిగరెట్ కాలుస్తుండగా.. మార్కెటింగ్ మేనేజర్ తన సిగరెట్ అంటించుకునేందుకు సదరు వ్యక్తి వద్ద నుంచి సిగరెట్ తీసుకున్నాడు. సిగరెట్ కాల్చి.. అనంతరం ఎప్పటిలాగానే ఆఫీస్కు వెళ్లాడు. అయితే రెండు రోజులకే మార్కెటింగ్ మేనేజర్లో కరోనా లక్షణాలు కనిపించాయి.
ఈ క్రమంలోనే వెంటనే పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సదరు మార్కెటింగ్ మేనేజర్ ఆఫీస్లో తన టీమ్కు తెలియజేయగా.. వారు కూడా టెస్ట్లు చేయించుకున్నారు. వారిలో ఏకంగా 18కి కరోనా పాజిటివ్గా తెలింది. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్లో ఉన్నారు. అయితే తనకు ఎక్కడ కరోనా సోకిందా..? అని మార్కెటింగ్ మేనేజర్ వారం రోజుల క్రితం నుంచి తాను కలిసిన వ్యక్తులను ఆరా తీయగా.. సిగరెట్ విషయం బయటపడింది.