`పుష్ప‌` విడుద‌ల వాయిదా..క్లారిటీ ఇచ్చేసిన చిత్ర‌యూనిట్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుద‌ల చేయ‌నున్నారు.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న విడుదల కానున్నట్లు ఇటీవలే చిత్ర‌యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వేగంగా విస్త‌రిస్తోంది. ఈ స‌మ‌యంలో చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు వాయిదా ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పుష్ప విడుద‌ల కూడా వాయిదా ప‌డుతుంద‌ని గ‌త రెండు రోజులుగా ప్ర‌చారం ఊపందుకుంది.

అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా వాయిదా పడిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేస్తామని నిర్మాత‌లు తెలిపారు. క‌రోనా కార‌ణంగా ప‌లు సినిమాలు షూటింగ్ ను వాయిదా వేసుకుంటున్నాయి. కానీ సుకుమార్ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు అని మేక‌ర్స్ తెలిపారు.