ఏపీ బీజేపీలో ఒంట‌రైన వీర్రాజు

ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్ర‌పక్షాలుగా ఉన్నా ఈ రెండు పార్టీల మ‌ధ్య క్షేత్ర‌స్థాయిలో పొస‌గ‌డం లేద‌న్న‌ది నిజం. ఏపీ బీజేపీ చంద్ర‌బాబు అనుకూల‌, చంద్ర‌బాబు వ్య‌తిరేక వ‌ర్గాలుగా చీలిపోయింది. వీరిలో చంద్ర‌బాబు వ్య‌తిరేక‌వ‌ర్గంలో ఆయ‌న్ను, టీడీపీని టార్గెట్ చేసే వాళ్ల‌లో రాజ‌మండ్రికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజుదే ఫ‌స్ట్ ర్యాంకు. వీర్రాజుకు జాతీయ స్థాయిలో ఉన్న లాబీయింగ్‌తో ఇక్క‌డ టీడీపీ, చంద్ర‌బాబుపై ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఒకానొక ద‌శ‌లో ఆయ‌న‌కే ఏపీ బీజేపీ ప‌గ్గాలు అన్న చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. అయితే వీర్రాజుకు ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇస్తే టీడీపీ, బీజేపీ సంబంధాలు చెడిపోతాయ‌ని చంద్ర‌బాబే వెంక‌య్య ద్వారా ఆయ‌న‌కు చెక్ పెట్టించార‌న్న టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీలో వీర్రాజు పూర్తిగా ఒంట‌రి అయిపోయిన‌ట్టే తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

వీర్రాజుకు కేంద్ర మంత్రి వెంక‌య్య‌, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నా ముందు నుంచి ప‌డ‌దు. ఇక బీజేపీకే చెందిన మ‌రో రాష్ట్ర మంత్రి మాణిక్యాల‌రావు ముందు వీర్రాజుకు వంత పాడినా త‌ర్వాత అభివృద్ధితో పాటు చంద్ర‌బాబు త‌న‌కు ఇస్తోన్న ప్ర‌యారిటీతో ఆయ‌న సైతం వీర్రాజుకు దూర‌మ‌య్యారు. ఇక విశాఖ ఎంపీ హ‌రిబాబు, న‌ర‌సాపురం ఎంపీ గంగ‌రాజు కూడా వెంక‌య్య మ‌నుషులే. విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చంద్ర‌బాబుకు అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌టా కూడా డ‌ప్పేస్తుంటారు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు వీర్రాజుకు వంత పాడుతూ వ‌స్తోన్న రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌కు వీర్రాజుకు ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా మండుతోంది. త‌న కాన్‌స్టెన్సీ డ‌వ‌ల‌ప్‌మెంట్‌కు చంద్ర‌బాబు ఇస్తోన్న ప్రాధాన్య‌త‌తో ఆయ‌న టీడీపీతో క్లోజ్‌గ మూవ్ అవ్వ‌డం వీర్రాజుకు న‌చ్చ‌డం లేదు. వీర్రాజుతో పొస‌గ‌ని ఆకుల రాజ‌మండ్రిలో ఆయ‌న కొత్త‌గా త‌న కోసం ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు.

ఆకుల సైతం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తూ అధిష్టానానికి ద‌గ్గ‌ర‌వ్వ‌డం వీర్రాజు కంట్లో న‌లుసులా మారింది. ఆయ‌న ఎక్క‌డ ఎదుగుతాడో అన్న డౌట్ వీర్రాజులో ఉన్న‌ట్టు తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఏదేమైనా ఆకుల కూడా దూరం అవ్వ‌డంతో ఇప్పుడు ఏపీ బీజేపీలో వీర్రాజు ఒంట‌రైపోయారు.