వైసీపీకి వరుస షాకులు.. మొన్న నంద్యాల, ఆ వెంటనే కాకినాడ, ఆ తర్వాత జడ్పీటీసీలు టీడీపీలోకి జంప్ ఈ షాకుల్లో భాగంగానే ఇప్పుడు మరో అదిరిపోయే షాక్ వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్కు తగలనున్నట్టు తెలుస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల ముందు వరకు కాస్త డల్గా ఉన్నట్టు కనిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు స్పీడ్ పెంచేసినట్టే కనపడుతోంది. 2019 మిషన్ను అప్పుడే స్టార్ట్ చేసేసిన బాబు నోట ముందస్తు ఎన్నికల మాట కూడా వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీలో అసలే డల్ అయిన విపక్ష వైసీపీని మరింత దెబ్బేసేందుకు బాబు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు తెరదీసినట్టే కనపడుతోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష్ను మరింత షురూ చేస్తున్నారు. ఇప్పటికే 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ గూటికి చేరిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో వైసీపీ వికెట్ కూడా పడేందుకు రెడీగా ఉన్నట్టు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
వైసీపీలో పడే ఈ లేటెస్ట్ వికెట్ అమరావతి ఏరియా నుంచే ఉండడం విశేషం. గుంటూరు జిల్లాలో నరసారావుపేట నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఏకంగా ఐదుసార్లు గెలిచారు. 2004 నుంచి ఇక్కడ టీడీపీ పట్టు కోల్పోతూ వస్తోంది. రెండు ఎన్నికల్లోను ఓడిపోయిన కోడెల గత ఎన్నికలకు ముందు ఆయన ఇక్కడ గెలవనన్న సందేహంతో పక్కనే ఉన్న సత్తెనపల్లికి మారి అక్కడ నుంచి స్వల్ప మెజార్టీతో గెలిచారు.
ఇక నరసారావుపేట నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో 16 వేల ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేసే బాధ్యతను చంద్రబాబు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు అప్పగించినట్టు సమాచారం. బాబు ప్లాన్తో రంగంలోకి దిగిన యరపతినేని గోపిరెడ్డిని టీడీపీలోకి తీసుకువచ్చేందుకు ఆయన ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. వైసీపీలో డిఫెన్స్లో ఉన్న గోపిరెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్రెడ్డిని జగన్ గురజాల ఇన్చార్జ్గా నియమించారు. అయితే మహేష్రెడ్డి మాత్రం నరసారావుపేట తమ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ నుంచే పోటీ చేస్తానని జగన్పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల వేళ గోపిరెడ్డిని పక్కన పెట్టేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ వైసీపీలోనే వినిపిస్తోంది. దీంతో గోపిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలోకి వచ్చేందుకు ఇష్టంగానే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన టీడీపీ ఎంట్రీ ఉంటుందని సమాచారం.