రాష్ట్రాలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోం ది. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను బలహీన పరచడం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయడం .. వంటి అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొరడా ఒకటి ఝళిపించింది. వాస్తవానికి.. అప్పులు చేయని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జనాభా ప్రాతిపదికన.. ఆయా రాష్ట్రాలు అవలంభిస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికన జరుగుతు న్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లోనూ.. కొత్త ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అవి సాగు, తాగు నీటి ప్రాజెక్టులు కావొచ్చు.. ప్రజలు ఉపాధి చూపించే పారిశ్రామిక నగరాల నిర్మాణం కావొచ్చు.. ఇవన్నీ.. ఒక ఎత్తయితే.. మరోవైపు..రాజకీయ పోటీ తత్వం పెరిగిన దరిమిలా రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావొచ్చు. వీటికి ప్రభుత్వాలు మెజారిటీ నిధులను వెచ్చించాల్సి వస్తోంది. దీనికితోడు.. కేంద్రం ఇస్తున్న ఆదేశాలు.. పెంచుతున్న పెట్రోల్ ధరలు.. ఇతరత్రా వ్యయాల రూపంలోనూ.. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. దాదాపు అన్ని రాష్ట్రాలు సతమతం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కొత్త పన్నుల విధానం మేరకు రావాల్సిన జీఎస్టీ వాటాలో కోతలు రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఒకప్పుడు ఉన్న గ్రాంట్ విధానం ఇప్పుడు లేకపోవడం.. స్పెషల్ పర్పస్ వెహికల్ రూపంలో అప్పులు చేసుకునేందుకు వెసులుబాటు ఇవ్వడం.. కూడా రాష్ట్రాలను అప్పుల బాట పట్టించింది. ఇవన్నీ కేంద్రానికి తెలియనివి కాదు. అయినప్పటికీ.. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి.. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆర్థిక క్రమ శిక్షణ తప్పుతున్నాయని చెప్పడం అంటే.. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
నైతికంగా.. ఆర్థికంగా.. ఆయా రాష్ట్రాలను దెబ్బతీయడం ద్వారా.. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ.. పాగా వేయాలనే ది.. ఇప్పుడు కనిపిస్తున్న మోడీ కొత్త ఎత్తుగడగా భావిస్తున్నారు పరిశీలకులు. నిజానికి ఇలాంటి రాజకీయం దేశంలోనే తొలిసారి. ఎక్కడైనా.. రాజకీయం చేయాలంటే.. ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎంచుకుంటారు. కానీ, ఇప్పుడు అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయి.
వాటిని పక్కకు తప్పించండి.. అనే పిలుపు ఇచ్చే దిశగా మోడీ చర్యలు ఉన్నాయనే భావన వ్యక్తమవుతోంది. పోనీ.. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయి.. బీజేపీ పాలన సాగించినా.. ఈ అప్పులు ఇప్పుడు తీర్చేయడం సాధ్యమేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా.. ఇదో వింత రాజకీయం..విస్తృత వ్యూహంతోనే అడుగులు పడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.