ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సామాజిక అంశాల పట్ల కూడా చురుగ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇటీవల సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలోనూ ఆర్పీ పట్నాయక్ స్పందించారు. రోడ్డుపై ఇసుకు పేరుకుపోయినా పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఆర్పీ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉంటే ఇటీవల సైదాబాద్లోని సింగరేణి కాలనికి చెందిన ఓ చిన్నారి .. అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని ఇంత వరకు పోలీసులు పట్టుకోలేదు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే నిందితుడికి సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతడి పేరు రాజు.. అని అతడికి చేతి మీద మౌనిక అనే పేరుతో ఓ ట్యాటూ ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టించిన వారికి రూ. 10 లక్షలు రివార్డు కూడా ప్రకటించారు.
తాజాగా ఈ విషయంపై ఆర్పీ స్పందించారు. ‘సైదాబాద్ నిందితుడిని పట్టుకొనేందుకు అంతా సహకరించండి. నిందితుడిని పట్టిస్తే నేను కూడా రూ. 50 వేలు ఇస్తా. అతడి చేతికి ట్యాటు ఉంది. అది తప్పకుండా పట్టిస్తుంది. దయచేసి మీ చుట్టుపక్కల గమనించండి. కిరాతకుడిని పట్టుకొనేందుక మనమూ సహకరిద్దాం’ అంటూ ఆర్పీ ఓ పోస్ట్ పెట్టారు.
సైదాబాద్ చిన్నారి ఘటన పట్ల సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మంచు మనోజ్ .. చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మహేష్, నాని కూడా స్పందించారు.