ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ఇదొకటి. ఇక్కడ వైసీపీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది. రెడ్డి, ఎస్సీ సామాజికవర్గాల హవా ఎక్కువ ఉండటం వల్ల..గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ లీడ్ సాధిస్తుంది. 12 సీట్లు ఉన్న ఈ జిల్లాలో 2014లో వైసీపీ 6, టిడిపి5, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 8, టిడిపి 4 సీట్లు గెలుచుకున్నాయి.
అయితే ఇప్పటికీ అక్కడ వైసీపీ హవా ఉంది. కానీ ఇటీవల లోకేష్ పాదయాత్ర జరిగింది. పాదయాత్రకు ప్రజల మద్ధతు బాగానే దక్కింది. దీంతో ఈ సారి ప్రకాశంలో టిడిపి హవా ఉంటుందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. మరి అలాంటి పరిస్తితి ప్రకాశంలో ఉందా? అంటే దానికి ఛాన్స్ లేదనే చెప్పాలి. జిల్లాలో వైసీపీ హవా పూర్తిగా ఉంది. ప్రస్తుతం వైసీపీకి లీడ్ ఉన్న సీట్లు..కందుకూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, చీరాల, కనిగిరి సీట్లు.
ఇక టిడిపికి అద్దంకి, పర్చూరు, కొండపి సీట్లలో పట్టు ఉంది. ఇటు దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు సీట్లలో హోరాహోరీ ఉంది. అయితే ఇక్కడ కొన్ని సమీకరణాలు మారితే..పరిస్తుతులు మారతాయి. జనసేనకు చీరాల, దర్శి, ఒంగోలు లాంటి సీట్లలో 10-15 వేల ఓటు బ్యాంకు ఉంటుంది. దాంతో టిడిపి-జనసేన కలిస్తే ఆ సీట్లలో వైసీపీ విజయం కష్టమవుతుంది. అయితే పొత్తు ఉన్నా సరే టిడిపి-జనసేనల మధ్య ఓట్లు బదలాయింపు పూర్తిగా జరగాలి. అలా జరగకపోతే వైసీపీకే లాభం. ఎటు చూసుకున్న ప్రకాశంలో వైసీపీ హవా ఉండేలా ఉంది.