తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అధిపత్య పోరు టీడీపీ అధినేతను కలవరపెడుతోంది. ఎలాగైన గెలవాలని ఓ వైపు చంద్రబాబు తాపత్రయ పడుతుంటే… పార్టీ తమకు గుర్తింపు ఇవ్వడం లేదని కొందరు సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్తానంలో కేవలం కొంతమందికే గుర్తింపు దక్కుతోందని.. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారికి గుర్తింపు రావడం లేదనే మాట ఇప్పుడు పెద్దఎత్తున వినిపిస్తోంది. వాస్తవానికి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదనేది బహిరంగ రహస్యం. మధ్యలో వచ్చి హడావుడి చేసే వారికే కీలక పదవులు ఇస్తున్నారనే అపవాదు కూడా చంద్రబాబు మూటగట్టుకున్నారు.
పార్టీలో గ్రూప్ తగాదాలను పక్కన పెట్టి గెలుపు కోసం ప్రతి ఒక్కరు పని చేయాలనేది టీడీపీ అధినేత మాట. అలా కాకుండా ఎవరైనా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలుంటాయని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అయితే బాబు ఇస్తున్న వార్నింగ్లు పార్టీలో కేవలం కిందిస్థాయి వారికే తప్ప,… పైస్థాయిలో ఉన్న వారికి వర్తించవా అనే మాట వినిపిస్తోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు చెప్పిన మాటే ఫైనల్. కానీ.. అసలు కథ లోపల వేరే ఉందనేది పార్టీలో కొందరికే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కంటే కూడా ముందు కొందరు నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు చెప్పిన మాటకే అధినేత ఆమోద ముద్ర వేస్తున్నారనేది అక్షర సత్యం. పార్టీలో కింజరాపు అచ్చెన్నాయుడు. యనమల రామకృష్ణుడు, టీడీ జనార్థన్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నేతలు ఇప్పుడు చక్రం తిప్పుతున్నారనేది బహిరంగ రహస్యం. దేవుని దర్శనం కావాలంటే.. ముందుగా పుజారి కరుణించాలనేలా… అధినేతను కలవాలన్నా కూడా… ముందుగా వీరి అనుమతి తీసుకోవాలనేలా పరిస్థితి మారిపోయింది.
ఈ సీనియర్ల మాట లెక్కచేయకపోతే మాత్రం… వారికే చర్యలు తీసుకునేలా అధినేతను ఒప్పిస్తున్నారు. కీలక నిర్ణయాలను వీరే తీసుకుని… వాటికి అధినేత ఆమోదం తెలిపేలా పావులు కదుపుతున్నారనేది అందరికీ తెలిసిన విషయం. చివరికి మహానాడు కమిటీ తీర్మానాలు, మ్యానిఫెస్టో రూపకల్పన, నేతలకు బాధ్యతల అప్పగింత వంటి కీలక అంశాలను కూడా వారు మాత్రమే తీసుకుంటున్నారు. చంద్రబాబుకు రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం ద్వారా ద్వితీయ శ్రేణి నాయకులకు సరైన అవకాశాలు రావడం లేదనేది వాస్తవం. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న వారిని కాదని… కొత్తగా వచ్చిన వారికి మాత్రం కీలక పదవులు ఇస్తున్నారు చంద్రబాబు. దీంతో దాదాపు 20 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వారు ఇప్పుడు పార్టీ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడిన వారిని పక్కన పెట్టారనే అపవాదును చంద్రబాబు మూటగట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉన్న వారికి ఈ సారి చంద్రబాబు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.