`ఆదిపురుష్‌` యూనిట్ కు బిగ్ షాక్‌.. ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్‌!

ఆదిపురుష్‌.. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మైథ‌లాజిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ నిన్న ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సీతారాములుగా ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ నటించారు. దాదాపు ఏడు వేల థియేట‌ర్స్ లో విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌చ్చాయి. అయినా స‌రే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం దుమ్ము దుమారం రేపుతోంది.

 

తొలి రోజు కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ. 32 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది అంటే ప్ర‌భాస్ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఓవైపు ఎన్నో విమ‌ర్శ‌లు, మ‌రెన్నో ట్రోల్స్ వ‌స్తున్నా.. ఫ్యాన్స్ మ‌రియు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఆదిపురుష్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో `ఆదిపురుష్‌` యూనిట్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిష‌న్ దాఖలైంది.

ఆదిపురుష్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. హిందువులకు అత్యంత పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉంద‌ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ చిత్రంలో దేవతామూర్తుల వర్ణన సరైన రీతిలో లేదని.. హిందూ బ్రాహ్మణుడైన రావణ పాత్రధారి గడ్డంతో కనిపించడం అభ్యంతరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దేవత మూర్తులకు సంబంధించిన అభ్యంతరక‌ర‌ సన్నివేశాలను సరిదిద్దడం లేదా తొలగించడం చేయాలి. లేదంటే ఆదిపురుష్ ప్రదర్శనను నిలిపివేయాలి అని విష్ణు గుప్తా పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.