గొప్ప మ‌న‌సు చాటుకున్న ర‌వితేజ‌.. రియ‌ల్ హీరో అంటూ వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. త‌న సినిమా వ‌ల్ల భారీగా న‌ష్ట‌పోయిన బ‌య్య‌ర్ల‌ను ఆదుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ర‌వితేజ రీసెంట్ గా `రావ‌ణాసుర‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా న‌టిస్తే.. మేఘా ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, సుశాంత్, జ‌య‌రామ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ర‌వితేజ ఇందులో గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించారు. అభిషేక్ పిక్చర్స్‌, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యాన‌ర్ల‌పై అభిషేక్ నామా, ర‌వితేజ నిర్మించిన ఈ చిత్రం 7 ఏప్రిల్ 2023న విడుదలైంది. అయితే తొలి ఆట‌తోనే నెగ‌టివ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుని బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ బోల్తా ప‌డింది. ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం రావితేజ నుంచి వ‌స్తున్న మూవీ కావ‌డంతో.. రిలీజ్ కు ముందు రావ‌ణాసుర థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకు కొనుగోలు చేశారు.

కానీ, సినిమా ఫ్లాప్ అవ్వ‌డం వ‌ల్ల బ‌య్య‌ర్లు గ‌ట్టిగానే న‌ష్ట‌పోయారు. దాంతో ర‌వితేజ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. త‌న సినిమాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన బ‌య్య‌ర్ల‌ను ఆదుకునేందుకు తగిన నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే కొందరు బయ్యర్లకు రవితేజ సెటిల్‌మెంట్ కూడా చేశాడని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ర‌వితేజ రియ‌ల్ హీరో అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.