నరేష్, పవిత్ర లోకేష్.. గత కొంత కాలం నుంచి ఈ జంట టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి సహజీవనం చేసుకున్న నరేష్, పవిత్ర.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. మరోవైపు వీరిద్దరూ జంటగా నటించిన `మళ్లీ పెళ్లి` సినిమా విడుదలకు సిద్ధమైంది. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు.
మే 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో నరేష్, పవిత్ర బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలే కాకుండా తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవిత్రతో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే తమ రిలేషన్ షిప్ ను, పెళ్లి కాకుండానే కలిసి ఉండడాన్ని తమ ఫ్యామిలీ అంగీకరించినట్టు నరేష్ స్వయంగా వెల్లడించారు.
పవిత్ర తన కుటుంబ సభ్యులందరికీ బాగా దగ్గరైందని.. ఆమె వంటలను కృష్ణ గారు ఎప్పుడూ మెచ్చుకునేవారని నరేష్ వెల్లడించాడు. అంతేకాదు, తన సవతి సోదరుడైన మహేష్ బాబు కూడా పవిత్రతో నా బంధాన్ని అంగీకరించాడని.. మహేష్ కి పవిత్ర అంటే చాలా ఇష్టం మరియు గౌరవం కూడా అని నరేష్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు నరేష్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.