బాలీవుడ్‌లో చిన్న వాటితోనే సరిపెట్టుకుంటున్న జాన్వీ.. టాలీవుడ్‌లో మాత్రం..!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జాన్వీ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి చాలా కాలం అవుతుంది. కానీ ఒక కమర్షియల్ బ్రేక్ కూడా రాలేదు. అయినా కూడా శ్రీదేవి కూతురు అనే ఒక కారణంతో ఆమెకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి జాన్వీ ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంది. ఈ అమ్మడు ఆఫర్స్ కోసం గ్లామర్ పంట బాగానే పండిస్తుంది.

బాలీవుడ్‌లో జాన్వీ తన కెరీర్‌ ప్రారంభంలో హైబడ్జెట్ సినిమాలలో నటించింది. కానీ ఒక్కటీ ఆమెకు విజయం తెచ్చిపెట్టలేదు. దాంతో ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలలో నటించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిబట్టి చూస్తే బాలీవుడ్ లో జాన్వీ కెరీర్ ఊహించిన విధంగా లేదని అర్థం అవుతుంది. అయితే ఆమె అందాల ఆరాబోత కార్యక్రమం కోసం మాత్రం అభిమానులు ఆత్రుత్తగా ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్ లో తక్కువ బడ్జెట్ సినిమాలతో అడ్జెస్ట్ అయిపోతున్న జాన్వీ కపూర్ టాలీవుడ్ లో మాత్రం కాస్త ఎక్కువ చేస్తుందనే విమర్శలను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎన్టీఆర్ 30 సినిమా లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా రామ్ చరణ్ సరసన నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే తెలుగులో ఒక చిన్న హీరోతో కలిసి నటించే అవకాశం వచ్చిందట జాన్వీ కి. అయితే నిర్మొహమాటంగా తాను చిన్న హీరోలతో నటించనని చెప్పేసిందట ఈ భామ. దాంతో బాలీవుడ్ లో చిన్న సినిమా లు చేస్తున్న జాన్వీ టాలీవుడ్ లో మాత్రం అధిక పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోలతో కలిసి నటించాలి అని డిమాండ్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు.